రైల్వేలో త్రివర్ణ శోభితం
ABN , First Publish Date - 2022-08-09T05:48:20+05:30 IST
ప్రతి ఇల్లు త్రివర్ణం (హర్ ఘర్ తిరంగా) పేరుతో విజయవాడ రైల్వే డివిజన్ ఆదివారం క్యాంపెయిన్ ప్రారంభించింది.
హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ను ప్రారంభించిన విజయవాడ రైల్వే
సిబ్బందికి జాతీయ జెండాల పంపిణీ
ఆంధ్రజ్యోతి, విజయవాడ : ప్రతి ఇల్లు త్రివర్ణం (హర్ ఘర్ తిరంగా) పేరుతో విజయవాడ రైల్వే డివిజన్ ఆదివారం క్యాంపెయిన్ ప్రారంభించింది. జాతీయ జెండాలు ధరించిన రైల్వే సిబ్బంది.. జాతీయ జెండాలతో ప్రదర్శన జరిపారు. విజయవాడ రైల్వే డివిజనల్ ఆఫీస్ ఆవరణలో డీఆర్ఎం శివేంద్ర మోహన్ రైల్వే సిబ్బందికి జాతీయ జెండాలు పంపిణీ చేపట్టారు. విజయవాడలో డీఆర్ఎం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగానే.. అదే సమయంలో రాజమండ్రి, నెల్లూరు, ఒంగోలు, కాకినాడు, ఏలూరు, తుని డిపోలకు చెందిన సూపర్ వైజర్లకు జాతీయ జెండాల పంపిణీ చేపట్టారు. స్వాతంత్య్రం సిద్ధించి డెబ్బై ఐదేళ్ల పూర్తయిన సందర్భంగా జాతీయ జెండాలను రైల్వే సిబ్బంది తమ ఇళ్ల మీద ఎగురవేయాలని డీఆర్ఎం పిలుపునిచ్చారు. జాతీయ జెండా పంపిణీ క్యాంపెయిన్ తొలిరోజున 3 వేల మంది రైల్వే సిబ్బందికి అందించారు. విజయవాడ డివిజన్ వ్యాప్తంగా మొత్తం 16,424 మంది రైల్వే ఉద్యోగులకు రానున్న రోజుల్లో జాతీయ జెండాలను పంపిణీ చేయనున్నారు.