‘జనవాణి’తో ప్రభుత్వంలో చలనం వస్తుంది: Nadendla Manohar
ABN , First Publish Date - 2022-07-01T23:59:47+05:30 IST
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘జనవాణి - జనసేన భరోసా’ కార్యక్రమంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో
విజయవాడ: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ‘జనవాణి - జనసేన భరోసా’ కార్యక్రమంతో ప్రభుత్వంలో చలనం వచ్చిందని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. పల్లెల్లో, పట్టణాల్లో వైసీపీ నేతలు సమస్యలను పట్డించుకోవడం లేదన్నారు. ఎక్కడ చూసినా తమ గోడు వినేవారు లేక ప్రజలు కన్నీరు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి పవన్ కృషి చేస్తున్నారని చెప్పారు.
జూలై 3, 10 తేదీలలో జనవాణి
‘‘విజయవాడ ఎం.బి.కె భవన్లో జూలై 3, 10 తేదీలలో జనవాణి కార్యక్రమం నిర్వహిస్తున్నాం. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. వాటిని సంబంధిత అధికారుల దృష్టికి మా టీం సభ్యులు తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తారు. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాలలో కూడా జనవాణి జరుగుతుంది. జనవాణి కార్యక్రమ నిర్వహణకు విజయవాడలో మూడు హాల్స్ చూశాం. వాటిని మాకు ఇవ్వనివ్వకుండా వైసీపీ నాయకులు అడ్డు పడ్డారు. ఇస్తే ఊరుకోమని వారిని హెచ్చరించారు. చివరకు కామ్రేడ్స్ మాకు హాల్ ఇచ్చారు. వారికి మా ధన్యవాదాలు.’’ - నాదెండ్ల మనోహార్
పవన్ స్పందించాకే.. ప్రభుత్వం
‘‘ముఖ్యమంత్రి జగన్ సొంత అమ్మమ్మ ఊర్లో కౌలు రైతులు చనిపోయారు. పవన్ కళ్యాణ్ రూ. లక్ష సాయం చేశాక.. ప్రభుత్వం కూడా రూ. లక్ష ఇచ్చింది. 74మంది రైతుల కుటుంబాలకు పవన్ సాయం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ అవార్డు ఎవరికి ఎలా వచ్చింది? ఈ మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉపాధి లేకపోగా.. ఉన్న ఉపాధి కూడా పోయింది. కియా మోటార్స్కి APIIC 63 ఎకరాల స్థలం ఎలా ఇచ్చారు. ఏ రూల్ ప్రకారం ఇచ్చారో చెప్పాలి. నిజంగా కియా పరిశ్రమ అక్కడ పెడుతున్నారా? మీడియా సాక్షిగా డిమాండ్ చేస్తున్నా.. సమాధానం చెప్పాలి.’’ అని నాదెండ్ల మనోహార్ అన్నారు.