జనసేన, బీజేపీ తరపున ప్రచారం చేస్తా: చింతమనేని
ABN , First Publish Date - 2021-03-03T20:49:49+05:30 IST
వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్
పశ్చిమ గోదావరి: వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచే దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకున్న చోట జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీలో ఉంటే వారి తరపున తాను ప్రచారంలో పాల్గొంటానని చింతమనేని ప్రభాకర్ ప్రకటించారు. ఏలూరు కార్పొరేషన్లో జరుగుతున్న ఎన్నికల పరిణామాల తీరుపై చింతమనేని మండిపడ్డారు.
కన్నతల్లి లాంటి పార్టీకి ద్రోహం చేసి కొందరు టీడీపీ అభ్యర్థులు విత్ డ్రా చేసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. పార్టీని అమ్ముకున్న వారికి భవిష్యత్తు ఉండదని ఆయన విమర్శించారు. టీడీపీని నమ్ముకున్న వారికి తాను అండగా ఉంటానని చింతమనేని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా విత్ డ్రా చేసుకున్న టీడీపీ అభ్యర్థుల డివిజన్లలో జనసేన, బీజేపీ అభ్యర్థులు ఉంటే వారి తరుపున ప్రచారంలో పాల్గొంటానని ఆయన ప్రకటించారు. చింతమనేని ప్రకటనతో ఏలూరు కార్పొరేషన్ ఎన్నికలు వేడెక్కాయి. ఏలూరు కార్పొరేషన్ ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గ నేత చింతమనేని ప్రభాకర్ జోక్యం చర్చనీయాంశంగా మారింది.