నాగబాబు వ్యాఖ్యలపై స్పందించిన జనసేన చీఫ్
ABN , First Publish Date - 2020-05-23T20:32:10+05:30 IST
మహాత్మాగాంధీ, గాడ్సేను ఉద్దేశించి జనసేన పార్టీ నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: మహాత్మాగాంధీ, గాడ్సేను ఉద్దేశించి జనసేన పార్టీ నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. వ్యక్తిగత అభిప్రాయాలతో పార్టీకి సంబంధం లేదని కుండబద్ధలు కొట్టారు. ట్విట్టర్ వేదికగా ప్రకటన విడుదల చేసిన పవన్.. సున్నితమైన అంశాలపై పార్టీకి చెందినవారు వ్యక్తం చేస్తున్న భావాలను పార్టీ అభిప్రాయాలుగా ప్రత్యర్థులు వక్రీకరిస్తున్నందున దీనిపై స్పష్టత ఇస్తున్నట్టు తెలిపారు. మీడియా వేదికగా నాగబాబు వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమన్నారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. పార్టీ నిర్ణయమేదైనా అధికారికంగానే ప్రకటిస్తామన్నారు. వాటిని మాత్రమే పరిగణనలోకి తీసుకోవలసిందిగా కోరుతున్నట్టు తెలపారు. కరోనా కష్టకాలంలో ... ప్రజాసేవ తప్ప మరే ఇతర అంశాల జోలికి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు. క్రమశిక్షణ అతిక్రమించకుండా ప్రజాసేవలో ముందుకు సాగాలన్నారు.