వారసత్వ రాజకీయాలు పోవాలి: Pawan
ABN , First Publish Date - 2022-05-21T01:48:03+05:30 IST
వారసత్వ రాజకీయాలు పోయి, కొత్తతరం నాయకత్వం రావాలని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు.
చౌటుప్పల్: వారసత్వ రాజకీయాలు పోయి, కొత్తతరం నాయకత్వం రావాలని జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్ పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వలిగొండ మండలం గోపరాజుపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త కొంగరి సైదులు కుటుంబసభ్యులను శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో పవన్కల్యాణ్ పరామర్శించారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని కుటుంబానికి రూ.5లక్షల ఆర్థికసాయం చెక్కును అందజేశారు. పిల్లల విద్య, వైద్య సంరక్షణ బాధ్యత తమదేనన్నారు. అనంతరం పవన్కల్యాణ్ మీడియాతో మాట్లాడుతూ మారుతున్న సమాజానికి అనుగుణంగా రాజకీయాల్లో కూడా మార్పు రావాలని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో కొత్తతరం నాయకత్వం రాజకీయాల్లోకి రావాలని, సామాజిక మార్పు తేవాలన్నారు. అట్టడుగు వర్గాలకు చెందిన వారు అధికారం చేపట్టాలని పవన్కల్యాణ్ ఆకాంక్షించారు.