అసెంబ్లీలో బూతు పురాణం

ABN , First Publish Date - 2020-12-03T08:54:34+05:30 IST

అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప రైతులను ఆదుకోవటంలో జగన్‌ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌

అసెంబ్లీలో  బూతు పురాణం

తిట్టుకోవడం కాదు రైతులను ఆదుకోండి..

24 గంటల్లో తక్షణ సాయం కింద 10వేలు ..

క్రిస్మస్‌ లోపు 30 వేలు ఇవ్వాలి

ఆ 151మంది కౌరవ సంతతితో సమానం..

ఒకదానికే దిక్కులేకపోతే 3 రాజధానుల డాబెందుకు?

ప్రభుత్వంపై పవన్‌ కల్యాణ్‌ ఆగ్రహం..

నివర్‌తో నష్టపోయిన పంటల పరిశీలన


విజయవాడ/తెనాలి/గుంటూరు(ఆంధ్రజ్యోతి)/రేపల్లె, డిసెంబరు 2: అసెంబ్లీలో బూతులు తిట్టుకుంటూ కాలం గడుపుతున్నారే తప్ప రైతులను ఆదుకోవటంలో జగన్‌ ప్రభుత్వం మీనమేషాలు లెక్కపెడుతోందని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ ధ్వజమెత్తారు. బుధవారం ఆయన కృష్ణాజిల్లా ఉయ్యూరు, పామర్రు, చల్లపల్లి, అవనిగడ్డ మండలాలతో పాటు గుంటూరు జిల్లా రేపల్లె, భట్టిప్రోలు, తెనాలి మండలాల్లో పర్యటించి నివర్‌ తుఫానుతో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారం అందించటంలో వైసీసీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. నష్టపోయిన రైతులకు క్రిస్మస్‌ లోపు ఎకరాకు రూ.30 వేలు చొప్పున ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి  డెడ్‌లైన్‌ విధించారు. తక్షణ సాయం కింద 24గంటల్లో ప్రతి రైతుకు రూ.10వేలు ఆర్థిక సహాయం అందించాలని లేకుంటే వారి తరఫున రోడ్డెక్కాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలంగాణలో వరదలు వస్తే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తక్షణ సాయంగా రూ.6,500 కోట్లు అందించిందన్నారు. మన రాష్ట్రంలో నేటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదంటే ఈ ప్రభుత్వానికి రైతులపై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. కొంతమంది మంత్రులు విచక్షణారహితంగా మాట్లాడుతూ రైతులను హేళన చేసేవిధంగా ప్రవర్తిస్తూ, వారికి ఎలాంటి నష్టం వాటిల్లలేదన్నట్లుగా ప్రవర్తిస్తున్నారన్నారు.


అది మంచి పద్ధతి కాదని సూచించారు. రాష్ట్రంలో 65శాతం మంది కౌలు రైతులే వరి పంట వేశారని వారిని తప్పనిసరిగా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. భూ యజమానులకు ఇచ్చేదానితో సమానంగా కౌలురైతులకూ ప్యాకేజీ అమలు చేయాలని, లేకుంటే ఉద్యమాన్ని భుజాన వేసుకుంటానని హెచ్చరించారు. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు రూ.5లక్షలు ఇవ్వాలన్నారు. గ్రేడింగ్‌, శాతం వంటి కేటగిరీలు లేకుండా నష్టం అంచనాలను నమోదు చేయాలన్నారు. తడిసిన ధాన్యాన్ని మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేయాలని పవన్‌ డిమాండ్‌ చేశారు. ‘‘ప్రజలకు మేలు చేస్తారని 151 మందిని గెలిపించారు. వారిప్పుడు అసెంబ్లీకి, ఇంటికే పరిమితమయ్యారు. ఉపయోగం లేనివారు అంతమంది ఉన్నా వారంతా కౌరవ సంతతితో సమానమే. ఒక్క రాజధానికే దిక్కులేదు గానీ మూడు రాజధానుల డాబెందుకో అర్థం కావటంలేదు. మూడు రాజధానులు కట్టేటంత సామర్థ్యం ఉంటే రైతులకు పరిహారం ఇవ్వటానికి ఇబ్బందేంటి?’’ అని పవన్‌ ప్రశ్నించారు. ఒక నేతలా తాను ఒక్క చాన్స్‌ ఇవ్వమని జనం దగ్గరకు వెళ్లి మోసం చెయ్యలేదన్నారు. కాగా, పామర్రు నియోజకవర్గంలో పెద్దపూడి అడ్డరోడ్డు వద్ద పవన్‌కల్యాణ్‌ను పెనమలూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కొలుసు పార్థసారథి తండ్రి కేపీ రెడ్డయ్య కలిశారు. పంటల నష్టం అంచనాలన్నీ మోసపూరితమేనని, రైతులకు సంపూర్ణ న్యాయం జరిగేలా పోరాటం చేయాలని పవన్‌ను ఆయన కోరారు. 


నేడు తిరుపతికి పవన్‌

తిరుపతి(ఆంధ్రజ్యోతి): నివర్‌ తుఫాను బాధితులను పరామర్శించేందుకు పవన్‌ గురువారం తిరుపతికి రానున్నారు. తిరుపతిలోని ఓ హోటల్లో మధ్యాహ్నం 3.30గంటలకు పార్టీ నాయకులతో సమావేశం నిర్వహిస్తారు.

Updated Date - 2020-12-03T08:54:34+05:30 IST