నాగార్జునసాగర్లో పోటీకి రెడీ అవుతున్న జనసేన!
ABN , First Publish Date - 2021-03-27T00:58:39+05:30 IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రోజుకో మలుపు తీసుకుంటోంది. ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి.
హైదరాబాద్: నాగార్జునసాగర్ ఉప ఎన్నిక రోజుకో మలుపు తీసుకుంటోంది. ఎన్నికకు సమయం దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. జనసేన కూడా సాగర్లో పోటీ చేస్తోందనే వార్తలు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి. ఇప్పటికే జనసేనాని పవన్ కల్యాణ్ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ ఉప ఎన్నికలో ఎస్టీ సామాజికవర్గానికి చెందిన అభ్యర్థిని దింపాలని జనసేప భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నిక ప్రక్రయ కోసం జనసేన ప్రచార కమిటీని కూడా ఏర్పాటు చేసేందుకు సన్నాహకాలు చేస్తునట్లు ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఇప్పుడు సాగర్లో జనసేన పోటీ చేయడం చర్చనీయాశమైంది. ఇదే అంశం రాజకీయవర్గాల్లో హాట్టాపిక్ అవుతోంది.
ఏపీ, తెలంగాణలో బీజేపీ-జనసేన మిత్రపక్షాలుగా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ నేతల విజ్ఞప్తి మేరకు జనసేన పోటీ నుంచి తప్పుకుంది. గ్రేటర్లో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం జనసేన కృషి చేసింది. అయితే గ్రేటర్లో సహకరించిన తమను బీజేపీ నేతలు పదేపదే అవమానిస్తున్నారని స్వయంగా పవన్కల్యాణ్ విమర్శలు చేయడంతో తెలంగాణ బీజేపీ, జనసేన మధ్య గ్యాప్ వచ్చిందట. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి వాణీదేవికి పవన్ మద్దతు ప్రకటించారు. దీంతో బీజేపీ షాక్కు గురయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయింది. సాగర్ ఉప ఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మాత్రమే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఆ పార్టీ అభ్యర్థి జనారెడ్డి జోరుగా ప్రచారం కూడా చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించలేదు. తిరుపతి లోక్సభ అభ్యర్థిగా రత్నప్రభను బీజేపీ ఎంపిక చేసింది. అయితే సాగర్ అభ్యర్థిని ప్రకటించకపోవడం గమనార్హం.