పవన్ పేరు వింటేనే మంత్రుల ఫ్యాంట్లు తడుస్తున్నాయ్!
ABN , First Publish Date - 2022-04-26T06:45:16+05:30 IST
జనసేనాని పవన్ కల్యాణ్ జనంలోకి వెడుతుంటే వైసీసీ మంత్రులకు, నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని, ఓటమి భయంతో వారు అవాకులు, చెవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ నేతలు ధ్వజమెత్తారు.
గుంటూరు, ఏప్రిల్ 25: జనసేనాని పవన్ కల్యాణ్ జనంలోకి వెడుతుంటే వైసీసీ మంత్రులకు, నేతలకు ప్యాంట్లు తడిచిపోతున్నాయని, ఓటమి భయంతో వారు అవాకులు, చెవాకులు పేలుతున్నారని జనసేన పార్టీ నేతలు ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్యాదవ్, రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు. మంత్రులుగా పాత పాలేర్ల స్దానంలో కొత్త పాలేరులు వచ్చారని, గతంలో గొంతు చించుకున్న పాత మంత్రులంతాగొడ్ల చావిడికే పరిమితమయ్యారని వారు ఎద్దేవా చేశారు. మీ నాయకుడు స్టోరీతో ’నేరస్తుడు’ అనే టైటిల్తో సినిమా రాబోతోందని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గన్మన్ను కొట్టిన విషయం మర్చిపోయావా? అంబటి అంటూ వారు ధ్వజమెత్తారు. రాంబాబు రాసలీలలు, అరగంట రాంబాబు, పారిపోయిన అంబటి వంటి పేర్లతో సినిమా టైటిల్స్ రిజిస్ట్రేషన్ అయ్యాయని తూర్పార పట్టారు. పవన్ కల్యాణ్ జీవితం తెరిచిన పుస్తకమని, వైసీపీ నేతల్లా చీకటి బ్రతుకు కాదని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ రైతులను పరామర్శించడం తప్పని దమ్ముంటే వైసీపీ మంత్రులు ప్రకటన చేయాలని జనసేన నేతలు సవాల్ విసిరారు. ఇప్పటికైనా వైసీపీ మంత్రులు నోరు అదుపులో పెట్టుకోకపోతే జనసేన శ్రేణులు వారి ఇళ్లను ముట్టడిస్తాయని బోనబోయిన, గాదె హెచ్చరించారు. సమావేశంలో జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ల సురేష్, నేతలు ఆళ్ల హరి, తవిటి భావన్నారాయణ, ఆడపా మాణిక్యాలరావు, బిట్రగుంట మల్లిక, నారదాసు ప్రసాద్, దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.