సీఎం పీఠం ఎక్కేవరకూ ఒకమాట.. ఆ తర్వాత: Nadendla
ABN , First Publish Date - 2021-10-10T19:11:08+05:30 IST
ఏపీలో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న కార్యక్రమాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఏలూరు: ఏపీలో క్షేత్రస్ధాయిలో జరుగుతున్న కార్యక్రమాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. సీఎం పీఠం ఎక్కేవరకూ ఒకమాట.. ఆ తర్వాత మరోకలా సామాన్యులకు ఎటువంటి ఉపయోగం లేకుండా పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కనీవినీ ఎరుగని రీతిలో ఆస్తులు సంపాదించుకున్నారని ఆరోపించారు. వందల కోట్ల రూపాయల ఆస్తులు కూడ బెట్టుకున్నారన్నారు. అప్పట్లో వంద కోట్లు అంటే ముఖ్యమంత్రి స్ధాయి వ్యక్తికి మాత్రమే ఉండేవని.. ఇప్పుడు శాసనసభ్యులు ఆ స్దాయి కూడా దాటిపోయారని ఆయన తెలిపారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో ఏది దొరికితే అది ఊడ్చుకుపోదామని చూస్తున్నారన్నారు. ఏపీలో జరుగుతున్న అవినీతి.. వ్యాపారవేత్తలను బెదిరించి వసూళ్లు చేయటం... వారు రాష్ట్రం విడిచి వెళ్లిపోయే వరకూ చేస్తున్న తీరు గురించి... వారు చెబుతుంటే బాధ కలిగిస్తుందన్నారు. రేషన్ కార్డులు, ఇళ్ల పట్టాల విషయంలో ఎవరిని ప్రశ్నించాలన్నా ప్రభుత్వ యంత్రాంగమే దాడి చేస్తుందని భయపడాల్సిన పరిస్ధితి ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రెండున్నరేళ్ల కాలంలో పాదయాత్రలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారన్నారు. దౌర్జన్యంగా అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి దొరికింది దోచుకోవాలనుకుంటే ప్రజలే సరైన సమయంలో బుద్ది చెబుతారని నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు.