జనసేన కార్పొరేటర్ అభ్యర్థి కిడ్నాప్కు యత్నం
ABN , First Publish Date - 2021-03-05T15:22:14+05:30 IST
పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆలమూరి సాంబశివరావును బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని..
అర్ధరాత్రి ఇంటికి వెళ్లి హడావుడి చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
పోలీసులు రమ్మన్నారని చెప్పి కిడ్నాప్ యత్నం
గట్టిగా నిలదీయడంతో పరార్
వన్టౌన్: పశ్చిమ నియోజకవర్గంలోని 52వ డివిజన్ జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి ఆలమూరి సాంబశివరావును బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించారు. గుర్తుతెలియని వ్యక్తిని సాంబశివరావు గట్టిగా ప్రశ్నించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. కొత్తపేట దూది ఫ్యాక్టరీ వీధిలో ఉంటున్న ఆలమూరి సాంబశివరావు 52వ డివిజన్లో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. ప్రచార కార్యక్రమాలు ముగించుకుని బుధవారం రాత్రి ఇంటికి చేరుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు గుర్తుతెలియని వ్యక్తి సాంబశివరావు ఇంటికి వెళ్లి వన్టౌన్ సీఐ రమ్మంటున్నారని చెప్పాడు. సీఐ తనకు తెలుసు అని, తాను ఫోన్ చేసి మాట్లాడతానని సాంబశివరావు చెప్పడంతో.. ఆ వ్యక్తి వన్టౌన్ సీఐ కాదు, కొత్తపేట సీఐ అని చెప్పాడు. ఆ సమయంలో సీఐ ఎందుకు రమ్మంటారని ప్రశ్నించిన సాంబశివరావు ఆ వ్యక్తిని సెల్ఫోన్లో ఫొటో తీయటానికి ప్రయత్నించారు. దీంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అతడిని వెంబడించగా, సమీపంలో ఐదారుగురు వ్యక్తులు నిలబడి ఉండటం గమనించానని సాంబశివరావు తెలిపారు. 52వ డివిజన్లో తాను గట్టి పోటీ ఇవ్వటం వల్లే తనను కిడ్నాప్ చేయటానికి ప్రయత్నించారని సాంబశివరావు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. పోటీ నుంచి విరమించుకోమని అధికార పార్టీకి చెందిన నాయకుడు అనేక సార్లు ఒత్తిడి తెచ్చినా తాను పోటీలో ఉండటం వల్లే తనను భయపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు.