ఒక్కటై ఓడిస్తాం!

ABN , First Publish Date - 2022-03-15T08:29:32+05:30 IST

2024లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా... వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిశాయి.

ఒక్కటై ఓడిస్తాం!

  • వైసీపీ వ్యతిరేక శక్తులు ఏకమవ్వాలి..
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను
  • బీజేపీ రోడ్‌మ్యాప్‌ కోసం వెయిటింగ్‌
  • 2024లో ప్రజా ప్రభుత్వం స్థాపిస్తాం
  • మేం వస్తే ‘అప్పుల్లేని ఆంధ్రప్రదేశ్‌’
  • ముమ్మాటికీ అమరావతే రాజధాని
  • అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం
  • సీపీఎస్‌ రద్దు.. మళ్లీ పాత పెన్షన్‌
  • ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తాం
  • జనసేనాని కార్యాచరణ ప్రకటన
  • వైసీపీ సర్కారుది విధ్వంసకర పాలన
  • కూల్చివేతలు... అశుభంతో ప్రారంభం
  • పెట్టుబడులు లేవు.. ఉన్నవీ పోతున్నాయి
  • ఇసుకను కరకరా నమిలేస్తున్నారు
  • భవన కార్మికుల ఉసురు తీశారు
  • నిషేధం అంటూనే మద్యం నుంచి సొమ్ములు
  • ‘ఒక్క చాన్స్‌’తో రాష్ట్రం పాతికేళ్లు వెనక్కి
  • మళ్లీ వస్తే పిల్లల చేతిలో చాక్లెట్లూ లాగేస్తారు!


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

2024లో ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. రాష్ట్ర ప్రయోజనాల రీత్యా... వైసీపీ వ్యతిరేక ఓటును చీలకుండా చూస్తామని ప్రకటించారు. ‘‘ఎమర్జెన్సీ సమయంలో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నీ కలిశాయి. ఇప్పుడూ అలాగే వైసీపీ వ్యతిరేక శక్తులు కలవాలి. ఆంధ్రప్రదేశ్‌ బాగు కోసం చెబుతున్నా... వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తే లేదు’’ అని పవన్‌ ఉద్ఘాటించారు. పార్టీలు, వ్యక్తిగత లాభాలు వదిలి రాష్ట్ర ప్రయోజనాలకు రావాలని... అప్పుడు పొత్తుల కోసం ఆలోచిస్తామని ప్రకటించారు. రాష్ట్ర బాధ్యతను జనసేన తీసుకుంటుందన్నారు. ఈ దిశగా బీజేపీ  నాయకులు రోడ్‌మ్యాప్‌ ఇస్తామని చెప్పారని, దానికోసం ఎదురు చూస్తానని తెలిపారు. రోడ్‌ మ్యాప్‌ ఎప్పుడు ఇస్తారో చెప్పాలని, వైసీపీని గద్దె దించుతామని ఆయన స్పష్టం చేశారు. సోమవారం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభలో పవన్‌ కల్యాణ్‌ ప్రసంగించారు. వైసీపీపై నిప్పులు చెరిగారు. భావి పొత్తులపై సంకేతాలు ఇచ్చారు. ‘‘ఇన్ని సంవత్సరాలు ప్రజలకు అండగాఉండి భుజంకాచాను. ఇప్పుడు నేను సంపూర్ణ ఆత్మవిశ్వాసంతో చెబుతున్నా. రాష్ట్ర బాధ్యతను  జనసేన తీసుకుంటుంది’’ అని పవన్‌ తన కార్యాచరణను విస్పష్టంగా ప్రకటించారు. 2019 ఎన్నికల్లో 137 సీట్లలో పోటీచేస్తే 7.24 శాతం ఓట్లు వచ్చాయని చెప్పారు.


ఒక ఎమ్మెల్యే సీటు నెగ్గినప్పటికీ... వైసీపీ లాక్కెళ్లిందని మండిపడ్డారు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయాలను వివరించారు. పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరుకుందని పవన్‌ ప్రకటించారు. ‘‘ఎంత సింధువైనా బిందువుతోనే మొదలవుతుంది. ఏడు శాతం నుంచి 27 శాతానికి, ఆ 27 నుంచి  ప్రభుత్వాన్ని స్థాపించే స్థానానికి ఎదగబోతున్నాం’’ అని తెలిపారు. ‘‘రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యంగా, ఆంధ్రప్రదేశ్‌ బాగుండాలి. ఈ రాష్ట్రం చీకట్లోకి వెళ్లకుండా చూడటం జనసైనికుల చేతుల్లోనే ఉంది. నేను నడిచి చూపిస్తాను. మీరు నడవండి.  ఇప్పుడు... వైసీపీ చీకటి పాలనను అంతమొందించే అవకాశం లభించింది. ఇలాంటి సామాజిక ప్రగతి నిర్మాణం చేసే అవకాశాలు అరుదుగా వస్తాయి. వాటిని సద్వినియోగంచేసుకోవాలి’’ అని పిలుపునిచ్చారు.   ‘‘2014లో సూటిగా ప్రశ్నించాం. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం. 2019లో బలంగా పోరాటం చేశాం. బరిలో నిలబడి ఉన్నాం. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం. ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తాం’’ అని ఉద్ఘాటించారు.


ఈ పాలన విధ్వంసంతో మొదలు...

 ‘‘కొత్త ఇంట్లోకి వెళ్తే శుభంతో మొదలుపెడుతాం. మీ ప్రభుత్వం అశుభంతో... కూల్చివేతలతో ప్రారంభించింది.  మూడు నెలలకే ఇసుక సమస్య వచ్చింది. 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డుమీద పడ్డారు. 32 మంది ప్రాణాలను మీ నాయకత్వం బలిగొంది.ఆ రోజు నుంచి ఇప్పుడు జనసేన సభకు ఆటంకం కలిగించే వరకు విధ్వంసాలే! ఇంత నెగటివ్‌ మనుషులా!’’ అని పవన్‌ ఈసడించారు. తన ప్రసంగాన్ని జై ఆంధ్రప్రదేశ్‌, జై తెలంగాణ, జై భారత్‌ అంటూ మొదలుపెట్టారు. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ప్రముఖులు, అన్ని పార్టీల నేతలకు పేరుపేరునా నమస్కరించారు. అన్ని మతాలను ప్రస్తావిస్తూ వాటి గొప్పతనాన్ని వివరించారు. 


ఒక కులాన్ని వర్గశత్రువుగా 

రాష్ట్రంలో ఒక కులాన్ని వైసీపీ వర్గశత్రువుగా ఎలా ప్రకటించింది? దీని వల్ల రాష్ట్రం అస్తవ్యస్తమవుతోంది. వైశ్య సామాజికవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇబ్బందులుపెడుతున్నారు. వారికి జనసేన అండగా ఉంటుంది. యానాది, రెల్లి, ముత్తరాసి, బీసీ. సంచారజాతులు ఎస్సీలు, గిరిజనులకు అండగా ఉంటాం. 


ద్వారంపూడికి భీమ్లానాయక్‌ ‘ట్రీట్‌మెంట్‌’ 

కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి అనే వ్యక్తి నన్ను అకారణంగా పచ్చిబూతులు తిట్టారు. అది వైసీపీకి  అలవాటే. నేను భరించాను. కానీ... నన్ను తిడితే మా జనసైనికులు, వీర మహిళలకు కోపం వస్తుంది. గతంలో ఆయన  (ద్వారంపూడి)  కుటుంబానికి  ఎస్పీ డీటీ నాయక్‌ ట్రీట్‌మెంట్‌ జరిగింది. భవిష్యత్‌లో ఇలాగే చేస్తే... ‘భీమ్లా నాయక్‌ ట్రీట్‌మెంట్‌’ అంటే ఏమిటో చూపిస్తాను. 


అమరావతే రాజధాని

ఎట్టి పరిస్థితుల్లో అమరావతే రాజధానిగా కొనసాగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారవు. ముఖ్యమంత్రులు మారినప్పుడల్లా పాలసీలు మారవు. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి మద్దతు తెలిపి వారి విజయానికి మనవంతు సహకారం అందించాం. రాజధాని విషయంలో ఇక్కడ పెనుమాక, ఉండవల్లి, మిగతా గ్రామాల రైతులు భూములు ఇవ్వడం ఇష్టం లేదంటే మేం వారి పక్కన నిలబడ్డాం. మేం మద్దతు ఇచ్చిన ప్రభుత్వంపై మేం గొంతెత్తినప్పుడు, వైసీపీ నాయకత్వం ఆ రోజు ఏం చేసింది? ఆనాడు గాడిదలు కాస్తున్నారా? మూడు రాజధానులు అని ఆ రోజు ఎందుకు చెప్పలేదు? 29 గ్రామాలు... 26,896 మంది రైతులు, 34వేల ఎకరాలు దీంట్లో 32 శాతం మంది ఎస్సీలు, మిగతా వారు బీసీలు, ఇతరులున్నారు.  ఆషామాషీగా ఉందా మీకు? మీ ఇష్టానికి రాజధాని మార్చేస్తారా? అమరావతి రైతులకు చెబుతున్నా! ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి. ఎక్కడికి వెళ్లదు. మీ మీదపడ్డ ప్రతీ లాఠీదెబ్బ నామీద పడినట్లే. అమరావతి ఇక్కడి నుంచి కదలదు. అలాగని మిగతా ప్రాంతాలను వదిలేస్తామని కాదు. 


ఇదేనా వైసీపీ ప్రతిజ్ఞ... 

వైసీపీ అధికారంలోకి రాగానే మూడు తప్పులు చేసిందని పవన్‌ పేర్కొన్నారు. అవి...1) గత ప్రభుత్వం చేసిన పనులను రద్దు చేయడం. 2) 2. పీపీఏ (విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు)లను రద్దుచేసింది. 3)  అమరావతి రాజధాని స్థానంలో మూడు రాజధానులని తప్పు మీద తప్పు చేసింది. విధ్వంసమే వైసీపీ విధానమని... ప్రతిజ్ఞ చేసినట్లుగా దారుణాలకు తెగబడుతున్నారని పవన్‌ అన్నారు. బహుశా... వైసీపీ ప్రతిజ్ఞ ఇదే కావొచ్చు అంటూ ఆ పాఠాన్ని చదివి వినిపించారు. అదెలా సాగిందంటే... ‘‘ఆంధ్రప్రదేశ్‌ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. న్యాయవ్యవస్థను లెక్కేచేయం.  పోలీసులను ప్రైవేటు ఆర్మీగా వాడేస్తాం.  రాష్ట్ర రహదారులను గుంతల మయంచేస్తాం. ప్రజల వెన్నుపూసలు విరగొట్టేవరకు విశ్రమించం. పెట్టుబడుల్లో 50 శాతం వాటా లాక్కుంటాం.  అన్నంపెట్టే రైతన్నలను అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం. ఇసుకను అప్పడంలా కరకరా నమిలేస్తాం.  పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టుపెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలతో చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ ఎంపీ అయినా సరే... ఎదురు తిరిగితే చితక్కొడతాం. ఒక్క చాన్స్‌తో ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లాం. ఇంకొక్క చాన్స్‌ ఇస్తే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు కూడా లాక్కుంటాం!’’


న్యాయవ్యవస్థనూ వదిలిపెట్టలేదు

వైసీపీ న్యాయ వ్యవస్థను కూడా తప్పుపట్టేదాకా వెళ్లింది.  హైకోర్టు ఒక పార్టీ బ్రాంచ్‌ ఆఫీసుగా మారిందని తిడతారా? ఏ స్థాయికి వీరి గుండాయిజం వెళ్లిందంటే ఇళ్లలోకి వచ్చి రైతులను కొట్టడం, న్యాయ వ్యవస్థ జీవితంలోకి వెళ్లడం వీరి గుండాయిజం. 


పోలీసులూ విసిగిపోయారు...

వైసీపీ వల్ల పోలీసు వ్యవస్థ కూడా విసిగిపోయింది. పోలీసులకు జీతభత్యాలు, కనీసం కరువు భత్యం సరిగ్గా ఇవ్వడం లేదు. అధికారంలోకి వస్తే వారాంతపు సెలవు ఇస్తానని చెప్పారు. అది లేకపోగా వీరి నిర్వాకంవల్ల పోలీసులకు పని మరింత పెరిగింది. వైసీపీ వారికి భయం లేదు. సీఐ ర్యాంకు అయినా సరే వారి చొక్కా కాలర్‌ పట్టుకుంటారు. చిత్తూరులో ఒక సీఐని కాలర్‌ పట్టుకున్నారు. ఇంకో సీఐని విశాఖ పీఠంలో చొక్కాలు విప్పికొడతామని మంత్రి ఒకరు బెదిరిస్తారు. కృష్ణలంక స్టేషన్‌లో ఎంపీ కానిస్టేబుల్‌ను కొట్టేశారు. ఓ పోలీసు బిడ్డగా చెబుతున్నా... ఓ తప్పుడు ఎమ్మెల్యే, గుండా మా తండ్రిని కొడితే ఏమిటి ఇది అనిపిస్తుంది కదూ!  అధికారంలోకి రాగానే 14,341 పోలీసు ఉద్యోగాలు భర్తీచేస్తామన్నారు. 400 తప్ప మిగతా ఉద్యోగాలు లేవు. ఈ పాలనలో తొలుత పారిశ్రామికవేత్తలు దెబ్బతిన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీపీఎస్‌ రద్దుచేస్తామన్నారు.  అధికారంలోకి  వచ్చాక మొండి చేయి చూపించారు.  మా నాయకుడికి ఆ రోజున విషయ పరిజ్ఞానం లేదని, టెక్నికాలిటీస్‌ తెలియదన్నారు.   


పార్టీ రంగుల కోసం 3వేల కోట్ల ఖర్చు 

వైసీపీ పార్టీ రంగుల కోసం 3వేల కోట్లు ఖర్చుపెట్టారు. ప్రకటనలకు 400 కోట్లు వృఽథా చేశారు. మీ పార్టీ రంగులు వేసుకోవడానికి 3వేల కోట్లు ఉంటాయి కానీ ఉద్యోగస్తులకు ఇవ్వడానికి  డబ్బులు ఉండవా? 




మేం అధికారంలోకి వస్తే..

సెక్యులరిజం అంటే ఒక మతానికి ఒక న్యాయం, మరో మతానికి మరో న్యాయం కాదు! మసీదులు, చర్చిలను ప్రభుత్వం కంట్రోల్‌లో పెట్టుకోదు. కానీ హిందూ దేవాలయాలపై ప్రభుత్వ నియంత్రణ ఎందుకు? దీనిని మేం పరిశీలిస్తాం.  టీటీడీ, ఎండోమెంట్‌ చట్ట సవరణను పరిశీలిస్తాం.  ఏపీని అప్పులు లేని రాష్ట్రంగా చేయాలన్నదే నా లక్ష్యం. ఆర్థికాభివృద్ధి సాధించడమే లక్ష్యం. ఇందుకోసం ఇన్వెస్టర్‌ ఫ్రెండ్లీ ప్రభుత్వం తీసుకొస్తాం. విశాఖను విశ్వనగరంగా, విజయవాడ, తిరుపతిని బలమైన హైటెక్‌ నగరాలుగా తీర్చిదిద్దుతాం. అమరావతిని అన్ని వర్గాలు, కులాలకు నివాసం కల్పించే అభ్యుదయ రాజధానిగా ముందుకు తీసుకెళ్తాం. కర్నూలు నగరం రుణం తీర్చుకుంటాం. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెడతాం. రాయలసీమ బిడ్డలను గల్ఫ్‌ నుంచి తీసుకొచ్చి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. పేదల ఇళ్ల నిర్మాణాలకు, తెల్లకార్డుదారులకు ఉచిత ఇసుక ఇస్తాం. జనసేన సౌభాగ్యపదం కింద యువతకు ఒక్కొక్కరికి 10 లక్షల ఆర్ధిక సహాయం చేస్తాం. సంవత్సరానికి లక్ష మంది  చొప్పున ఐదేళ్లలో 5 లక్షల మందికి బ్యాంకులో డబ్బు వేస్తాం. బడుగు, బలహీనవర్గాలకు ప్రాధాన్యం ఇస్తాం. వ్యవసాయరంగాన్ని లాభసాటిగా మారుస్తాం. గిట్టుబాటు రాక రైతులు ఏడుస్తున్నారు. రైతు కన్నీరుపెట్టకూడదు. రైతులతో మాట్లాడుతాం. వారి  కష్టాలను అర్ధం చేసుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేస్తాం. మద్దతు ధర, పుడ్‌ప్రాసెస్‌, పంటకాలువలు, మినీ రిజర్వాయర్లను ఆధునీకరిస్తాం. 


ప్రతి ఉద్యోగ ఖాళీ భర్తీచేస్తాం... 

ఖాళీగా ఉన్న ప్రతి ఉద్యోగాన్నీ జనసేన అధికారంలోకి రాగానే భర్తీ చేస్తుంది. నిరుద్యోగుల ప్రయోజనాలను కాపాడుతాం. ప్రైవేటు రంగంలో ఏటా 5 లక్షల ఉద్యోగాలు కల్పించేలా ప్రణాళిక అమలు చేస్తాం. ఉద్యోగులకు పీఆర్‌సీ సవరణ చేయిస్తాం. ఓ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా సీపీఎ్‌సను రద్దుచేయిస్తాం. పాత పెన్షన్‌ విధానం తీసుకొస్తాం. మీకు అండగా ఉంటాం. 


ఇదీ అప్పులవల్ల అనర్థం...

 తెలంగాణ ఆదాయం 99,900 కోట్లు. ఆంధ్రా ఆదాయం లక్షా 17వేల కోట్లు. ఈ ఆదాయం ఎటుపోతోంది? ఏం చేస్తున్నారు? తాకట్టులో భారత దేశం అన్నట్లు... ‘అప్పులో ఆంధ్ర’గా మారిపోయింది. దాని ప్రభావమే ప్రజలపై పడుతోంది. ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు? టీచర్‌ ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? కొత్త నియామకాలు ఎందుకు చేపట్టడం లేదు? ఉద్యోగుల జీతాలు ఎందుకు పెరగడం లేదు? అమ్మఒడి పథకానికి డబ్బులు ఎందుకు ఆగాయి? ఎయిడెడ్‌ స్కూల్స్‌, కాలేజీలను ఎందుకు మూసివేస్తున్నారు. ఆరోగ్యశ్రీని ఎందుకు మంచం ఎక్కించారు? ిపింఛన్లు ఎందుకు తగ్గించారు? దీనింతటికీ కారణం... అప్పులు చేయడమే!


పెట్టుబడులను చంపేశారు 

వైసీపీ నేతలు పెట్టుబడులను చంపేశారు. ఏపీ అంటే ఎవ్వరూ రావడం లేదు. ఉన్నవాటిని పంపించేస్తున్నారు. అమర్‌రాజా కంపెనీ ఓఉదాహరణ. అనంతపురం జిల్లాలో కియతో రావాల్సిన అనుబంధ పరిశ్రమలు రాలేదు. 


మద్యం ఆదాయంలో రికార్డు

టీడీపీ హయాంలో మద్యంపై 59 వేల కోట్లు ఆదాయం రాగా... వైసీపీ రెండున్నరేళ్లలోనే 45వేల కోట్లు సంపాదించింది. ధరలు పెంచితే మద్యం తాగేయడం మానేస్తారని ఓ దరిద్రపు, నీచ, నికృష్ట వాదన వినిపిస్తారు. నాసిరకం లిక్కర్‌ అమ్ముతున్నారు. జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 12 మంది మరణించారు. ఇండియన్‌ మేడ్‌ ఫారిన్‌ లిక్కర్‌ కాదు.. అది ఇడుపులపాయ ఫారిన్‌ లిక్కర్‌! 25వేల కోట్ల మద్యం ఆదాయం వారి జేబుల్లోకి చేరుకుంది. 



Updated Date - 2022-03-15T08:29:32+05:30 IST