కర్నూలుకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలి: Pawan
ABN , First Publish Date - 2021-10-22T18:42:54+05:30 IST
ఎందరో స్వాతంత్ర్య సమెయోధులు తమకు స్పూర్తి ప్రదాతలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
అమరావతి: ఎందరో స్వాతంత్ర్య సమెయోధులు తమకు స్పూర్తి ప్రదాతలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బూరుగుల రామకృష్ణ స్వచ్ఛందంగా ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకున్నారని తెలిపారు. పీవీ నరసింహారావు ప్రధాని అయ్యాక ఎన్నో ఆర్ధిక సంస్కరణలు తెచ్చారని గుర్తుచేశారు. దామోదరం సంజీవయ్య రెండేళ్లే పదవిలో ఉన్నా... ఎంతో సేవ చేశారని కొనియాడారు. వరదరాజుల ప్రాజెక్టు, పులిచింతల ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లారని తెలిపారు. కార్మిక శాఖ మంత్రిగా కార్మికుల కోసం అనేక విధానాలు అమలు చేశారని ఆయన అన్నారు. తెలుగు భాషలోనే ఉత్తర, ప్రత్యుత్తరాలు నడపాలని ఆదేశించారని చెప్పారు. వెనుకబడిన తరగతులవారికి రిజర్వేషన్ల కోసం సంజీవయ్య కృషి చేశారన్నారు. చాలా వృద్దాప్య, దివ్యాంగుల పెన్షన్ పధకాలకు ఆద్యుడన్నారు. ఇటువంటి మహనీయుడు పేరు నేటి తరాలకు తెలియకుండా చేశారని మండిపడ్డారు. పాలకులు అటువంటి మహనీయుల త్యాగాలను కనీసం గుర్తు చేసుకోవడం లేదన్నారు.
కోటి రూపాయల నిధులు సేకకరించి... దామోదరం సంజీవయ్య స్మారక భవనాన్ని నిర్మిస్తామని పవన్ ప్రకటించారు. కర్నూలు జిల్లాలోని పెదపాడులో ఉన్న ఆయన ఇంటిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆయన చనిపోయే నాటికి బ్యాంకులో రూ.17వేలు, ఒక ఫియేట్ కారు మాత్రమే ఉన్నాయన్నారు. మన పాలకులు ఇటువంటి మహానుభావుల త్యాగాలను నేటి తరానికి తెలియ చెప్పాలని జనసేనాని అన్నారు. అందుకే తమ బాధ్యతగా కోటి రూపాయల నిధులు సేకరించి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కడప జిల్లాకు వైఎస్సార్ అని పేరు పెట్టినప్పుడు... కర్నూలు జిల్లాకు దామోదర సంజీవయ్య పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లకపోతే... అధికార మార్పిడి జరిగిన అనంతరం తామే పేరు మారుస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.