Jammu and Kashmir : నటి హంతకులు ఎన్‌కౌంటర్‌లో హతం

ABN , First Publish Date - 2022-05-27T19:32:36+05:30 IST

కశ్మీరు టీవీ నటి అమ్రీన్ భట్‌ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను

Jammu and Kashmir :  నటి హంతకులు ఎన్‌కౌంటర్‌లో హతం

శ్రీనగర్ : కశ్మీరు టీవీ నటి అమ్రీన్ భట్‌ను దారుణంగా హత్య చేసిన ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. పుల్వామా, శ్రీనగర్ జిల్లాల్లో జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం నలుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు ఈ నటిని హత్య చేసినవారని జమ్మూ-కశ్మీరు పోలీసులు శుక్రవారం  తెలిపారు. 


పోలీసు అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, పుల్వామా (Pulwama) జిల్లాలోని అవంతిపొరలో అగన్హంజిపొర ప్రాంతంలో గురువారం రాత్రి ఎన్‌కౌంటర్ జరిగింది. బుడ్గాం (Budgam) జిల్లాలో టీవీ నటి అమ్రీన్ భట్‌ (Amreen Bhat)ను బుధవారం హత్య చేసిన ఇద్దరు ఉగ్రవాదులు షాహిద్ ముష్తాక్ భట్, ఫర్హాన్ హబీబ్ ఈ ఎన్‌కౌంటర్లో మరణించారు. వీరు లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్ లతీఫ్ ఆదేశాల మేరకు అమ్రీన్‌ను హత్య చేశారు. వీరి నుంచి ఓ ఏకే 56 రైఫిల్, 4 మ్యాగజైన్స్, ఓ పిస్తోలును స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను కశ్మీరు జోన్ ఐజీపీ విజయ్ కుమార్ ఓ ట్వీట్‌లో ధ్రువీకరించారు. 


శ్రీనగర్ (Srinagar) సిటీలోని సౌర ఏరియాలో మరొక ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు తెలిపారు. గడచిన మూడు రోజుల్లో కశ్మీరు లోయ (Kashmir Valley)లో జరిగిన ఎన్‌కౌంటర్లలో ముగ్గురు జైషే మహమ్మద్ ఉగ్రవాదులు, ఏడుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదులు హతమైనట్లు తెలిపారు. 


Updated Date - 2022-05-27T19:32:36+05:30 IST