Jal Saheli : కనుమరుగైన నీటి వనరుల పునరుజ్జీవానికి మహిళల కృషి

ABN , First Publish Date - 2022-06-30T20:51:47+05:30 IST

నీరు ప్రాణాధారం, జీవనాధారం. వాతావరణ మార్పుల (Climate Change) వల్ల

Jal Saheli : కనుమరుగైన నీటి వనరుల పునరుజ్జీవానికి మహిళల కృషి

న్యూఢిల్లీ : నీరు ప్రాణాధారం, జీవనాధారం. వాతావరణ మార్పుల (Climate Change) వల్ల మన దేశంలో చాలా చోట్ల జలాశయాలు కనుమరుగైపోతున్నాయి. ముఖ్యంగా బుందేల్‌ఖండ్ (Bundelkhand) ప్రాంతంలో నీటి చుక్కను దర్శించడం చాలా కష్టం. నూతులు, చెరువులు ఎండిపోయాయి. వీటిని పునరుజ్జీవింపజేయాలనే లక్ష్యంతో దాదాపు వెయ్యి మంది మహిళలు ‘జల మిత్రులు’ (Jal Saheli)గా నడుం బిగించారు. కొన్నేళ్ళ నుంచి తాము చేస్తున్న కృషి ఫలిస్తుందని, నీటి తడి కనిపించని రోజులు మారడం ఇక ఎంతో  దూరంలో లేవని ఆశిస్తున్నారు. 


తాగునీటి సరఫరా పెను సమస్య

భారత దేశ జనాభా దాదాపు 140 కోట్లు. ప్రజలందరికీ సురక్షిత నీటిని అందజేయడం ప్రభుత్వానికి పెను సమస్యగా మారింది. వాతావరణ మార్పుల వల్ల అనూహ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి. బుందేల్‌ఖండ్ ప్రాంతంలో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉందంటే, రైతులు తమ భూములను వదిలిపెట్టి, సమీపంలోని నగరాలకు వెళ్ళి, జీవనోపాధి కోసం నానా కష్టాలు అనుభవిస్తున్నారు. 


జల్ సహేలీ

నీటి కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించాలనే లక్ష్యంతో జల్ సహేలీ (జల మిత్రులు) స్వచ్ఛంద సేవా సంస్థ 2005లో ఏర్పడింది. దాదాపు 1,000 మంది మహిళలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి, సేవలందిస్తున్నారు. బుందేల్‌ఖండ్‌లో జలాశయాలను పునరుద్ధరించి, అదృశ్యమైన నీటి వనరులను పునరుజ్జీవింపజేసేందుకు అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. రుతుపవనాల (Monsoon) వల్ల కురిసే వర్షాలను ఒడిసిపట్టి, చెరువులు, బావులు, కాలువలు వంటి జలాశయాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రాళ్లు, కాంక్రీట్ మోసుకెళ్ళి, వర్షపు నీరు వృథాగా పోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.


ఓ జల మిత్ర మహిళ మాట్లాడుతూ, తమ గ్రామంలోని కాలువలో ఏడాది పొడవునా నీరు ప్రవహించేదని తమ పెద్దలు చెప్పేవారని, అయితే ఇప్పుడు ఆ కాలువలో కనీసం ఒక చుక్క నీరు అయినా లేదని తెలిపారు. బావులు కూడా ఎండిపోయాయన్నారు. 


మన దేశంలో కురిసే వర్షపాతంలో దాదాపు 75 శాతం ఈ రుతుపవనాల నుంచే వస్తుంది. దేశవ్యాప్తంగా 60 కోట్ల మంది తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారు. బుందేల్‌ఖండ్‌లో దాదాపు 300 గ్రామాలు ఉన్నాయి. జల మిత్రులు చేస్తున్న కృషి ఆశలను చిగురింపజేస్తోంది. అగ్రోతా గ్రామంలో జల మిత్రులు కొత్త పరీవాహక ప్రదేశాలను గుర్తించి, నీటిని పరిరక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ కృషి ఫలిస్తోందని వీరు సంతోషిస్తున్నారు. రుతుపవనాల కాలంలో కురుస్తున్న వర్షపు నీటిని దాదాపు ఆరు చోట్ల తాము నిల్వ చేయగలుగుతున్నామని చెప్తున్నారు. 


నీతీ ఆయోగ్ హెచ్చరిక

ఈ దశాబ్దం చివరికి మన దేశంలో దాదాపు 40 శాతం మందికి తాగు నీరు అందుబాటులో ఉండకపోవచ్చునని నీతీ ఆయోగ్ చెప్తోంది. వర్షాలు కురవడంలో సరైన క్రమం లేకపోవడం, మితిమీరిన వేడి గాలులు బుందేల్‌ఖండ్ వాతావరణాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ శతాబ్దం ప్రారంభంలో ఇక్కడ తీవ్ర కరువు ఏర్పడింది. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త సంజయ్ సింగ్ అగ్రోతా గ్రామ మహిళలకు నీటి పరిరక్షణలో శిక్షణ ఇచ్చారు. వర్షపు నీటిని నిల్వ చేయడం నేర్పించారు. 


అగ్రోతాలో సాగునీటి పథకం ప్రారంభానికి ముందు మహిళలు రోజూ అనేక మైళ్ళ దూరం ప్రయాణిస్తూ, నీటి కోసం అన్వేషించవలసి వచ్చేది. కరువు వల్ల సామాజికంగా పెను మార్పులు వచ్చాయి. పురుషులు తమ కుటుంబాలను గ్రామాల్లో వదిలిపెట్టి, నగరాలకు వెళ్ళిపోతున్నారు. 


జల మిత్రుల నెట్‌వర్క్‌ను 2005లో ప్రారంభించారు. అప్పటి నుంచి వీరు చేస్తున్న కృషి సత్ఫలితాలు ఇస్తుండటంతో 110 గ్రామాలు తమ నీటి అవసరాలను తామే తీర్చుకోగలుగుతున్నాయి. దీంతో ప్రజలు వలస వెళ్ళవలసి అవసరం లేకుండాపోయింది. 


Updated Date - 2022-06-30T20:51:47+05:30 IST