జక్కేపల్లి ఆర్బీఎల్ ఫ్యాక్టరీ సామర్థ్యం పెరిగితే ఉద్యోగావకాశాలు మెరుగు
ABN , First Publish Date - 2022-06-29T06:04:07+05:30 IST
జక్కేపల్లి ఆర్బీఎల్ ఫ్యాక్టరీ సామర్థ్యం పెరిగితే ఉద్యోగావకాశాలు మెరుగు
- పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణలో ఇన్చార్జి కలెక్టర్ విజయకుమారి
యాలాల, జూన్ 28: యాలాల మండలం జక్కేపల్లి ఆర్బీఎల్ ఫ్యాక్టరీ సామర్థ్యం పెరిగితే చుట్టుపక్కల గ్రామాల రైతులకు, వారి పిల్లలకు ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉందని వికారాబాద్ జిల్లా ఇన్చార్జి కలెక్టర్ విజయకుమారి అన్నారు. మంగళవారం ఫ్యాక్టరీ ఆవరణలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఇన్చార్జి కలెక్టర్ హాజరయ్యారు. ప్రస్తుతం ఉన్న ధాన్యం ఆధారిత డిస్టలరీ ప్లాంట్ సామర్థ్యాన్ని 90కేఎల్పీడీ నుంచి 200కేఎల్పీడీ వరకు పెంపు, విస్తరణ 3.0ఎండబ్ల్యూ నుంచి 5.0ఎండబ్ల్యూ వరకు గాను ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నామని ఆమె చెప్పారు. ఈ ఫ్యాక్టరీ సామర్థ్యం పెరిగితే కొత్తగా ఉద్యోగావకాశాలు కూడా పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక్కడి యువతకు, రైతులకు స్థానికంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రెట్టింపు అవుతాయన్నారు. ఇదిలా ఉంటే ఫ్యాక్టరీ నుంచి వచ్చే వ్యర్థాలను బయటికి పంపేలా ప్రత్యేక డ్రెయిన్ను ఏర్పాటు చేయించాలని కొందరు రైతులు కోరారని ఇన్చార్జి కలెక్టర్ తెలిపారు. సమావేశంలో తహసీల్దార్ గోవిందమ్మ, సర్పంచ్ శ్రీనివాస్, ఫ్యాక్టరీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివా్సరెడ్డి, ఎన్జీవో నాయకులు తదితరులు పాల్గొన్నారు.