కాళ్లు, చేతులు కోల్పోయిన బాలుడికి కృత్రిమ అవయవాలు

ABN , First Publish Date - 2021-01-24T06:32:36+05:30 IST

కరెంట్‌ షాక్‌తో కాళ్లు, చేతులు కోల్పోయిన బాలుడికి స్వచ్ఛంద సంస్థ సహాయంతో జైపూర్‌ కృత్రిమ అవయవాలు అమర్చారు.

కాళ్లు, చేతులు కోల్పోయిన బాలుడికి కృత్రిమ అవయవాలు
కృత్రిమ అవయవాలతో బాలుడు మధుకుమార్‌

మునిపల్లి, జనవరి 23: కరెంట్‌ షాక్‌తో కాళ్లు, చేతులు కోల్పోయిన బాలుడికి స్వచ్ఛంద సంస్థ సహాయంతో జైపూర్‌ కృత్రిమ అవయవాలు అమర్చారు. మునిపల్లి మండలం కంకోల్‌కు చెందిన తుల్జారాంకు నలుగురు పిల్లలు. చిన్న కుమారుడైన మధుకుమార్‌ 2019 సెప్టెంబర్‌ 15న డాబా పైన ఆడుకుంటుండగా హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలు తగిలాయి. ప్రమాదంలో కాళ్లు, చేతులు పూర్తిగా దెబ్బతినడంతో వైద్యులు ఆపరేషన్‌ చేసి తొలగించారు. బాలుడి పరిస్థితి తెలుసుకున్న హైదరాబాద్‌ కోఠిలో ఉన్న భగవాన్‌ మహవీర్‌ వికలాంగ సహాయక సమితి కృత్రిమ అవయవాలు అమర్చడానికి సాయం చేయడానికి ముందుకు వచ్చింది. డాక్టర్‌ పూజా ముకుల్‌ ఆధ్వర్యంలో ఇటీవల బాలుడిని జైపూర్‌కు తీసుకువెళ్లి ప్రత్యేకంగా కాళ్ల్లు, చేతులు తయారు చేయించి అమర్చారు. కొద్దిరోజుల్లో వైద్యుల సమక్షంలో నడవడం, చేతులను ఉపయోగించడంలో శిక్షణ ఇప్పిస్తామని తండ్రి తుల్జారాం చెప్పారు. 


నోటితోనే బొమ్మలు..

స్థానిక పాఠశాలలో ఆరో తరగతి చదివే మధుకుమార్‌ చిన్నప్పటి నుంచి చదువుతో పాటు ఆట, పాటల్లోనూ చురుగ్గా ఉండేవాడు. పాఠశాలలో ఏ కార్యక్రమం జరిగినా చురుగ్గా పాల్గొనేవాడు. ప్రమాదం అనంతరం కాళ్లు, చేతులు కోల్పోయినా ఆత్మవిశ్వాసం మాత్రం కోల్పోలేదు. ఓ వైపు చదువు కొనసాగిస్తూనే మరోవైపు నోటితో బొమ్మలు వేయడం ప్రాక్టిస్‌ చేస్తున్నాడు. నోటితో బ్రష్‌ పట్టుకుని బొమ్మలు గిస్తున్నాడు.

Updated Date - 2021-01-24T06:32:36+05:30 IST