కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం: జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2021-12-18T20:53:41+05:30 IST

2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తాం: జగ్గారెడ్డి

సంగారెడ్డి: 2024లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. పెట్రోల్, వంట గ్యాస్ ధరల పెంపును నిరసనగా అమేథీలో రాహుల్‌గాంధీ చేపట్టిన పాదయాత్రకు మద్దతుగా సంగారెడ్డిలో జగ్గారెడ్డి శనివారం పాదయాత్ర చేపట్టారు. సంగారెడ్డి పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ఈ పాదయాత్ర కొనసాగింది. ఈసందర్భంగా శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మూడేళ్ల నుంచి ధరలు తగ్గించాలని కాంగ్రెస్ ఉద్యమాలు చేస్తోందన్నారు. ఎన్ని ఉద్యమాలు చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ధరలు తగ్గించడం లేదని చెప్పారు. పెంచిన ధరలు తగ్గించాలని రాహుల్‌గాంధీ , ప్రియాంక‌గాంధీ, ఢిల్లీ, యూపీలో పాదయాత్ర చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పెట్రోల్, డీజిల్ గ్యాస్ ధరలను తగ్గిస్తుందని రాహుల్ గాంధీ పలు సందర్భాల్లో చెప్పారన్నారు.కాంగ్రెస్ ఏ హామీ ఇచ్చిన నిలబెట్టుకునే తత్వం పార్టీకి ఉందన్నారు. రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ ఒకే విడతలో మాఫీ చేస్తామని జగ్గారెడ్డి తెలిపారు.

Updated Date - 2021-12-18T20:53:41+05:30 IST