జగ్గారెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు..

ABN , First Publish Date - 2022-02-19T18:11:20+05:30 IST

సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు టీ.కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు.

జగ్గారెడ్డికి కాంగ్రెస్ నేతల బుజ్జగింపులు..

హైదరాబాద్: సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని బుజ్జగించేందుకు టీ.కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. రాజీనామాకు సిద్దమైన జగ్గారెడ్డి సొంతపార్టీ పెడతారని, లేని పక్షంలో టీఆర్ఎస్‌లోకి వెళతారని ప్రచారం జరుగుతున్న సమయంలో జగ్గారెడ్డిని పార్టీలో ఉంచేందుకు టీకాంగ్రెస్ నేతలు చివరి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో జగ్గారెడ్డి ఉన్నారు. ఆయనను వీ.హనుమంతరావు కలిసారు. పార్టీని వీడొద్దంటూ బుజ్జగిస్తున్నారు. అటు పలువురు కాంగ్రెస్ నేతలు కూడా జగ్గారెడ్డికి ఫోన్లు చేసి సముదాయిస్తున్నారు.


ఈ సందర్భంగా జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తనకు పార్టీలో అవమానం జరుగుతోందని చెప్పారు. మంత్రి కేటీఆర్‌ను పొగడడంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ గురించి అవగాహన లేనివారు అందరినీ ఇబ్బంది పెడుతున్నారంటూ పరోక్షంగా రేవంత్ రెడ్డి వర్గంపై విమర్శలు చేశారు. తన అనుచరులు కూడా ఇబ్బందులు పడుతున్నారని జగ్గారెడ్డి తెలిపారు. 


ABN ఆంధ్రజ్యోతితో వీహెచ్ మాట్లాడుతూ జగ్గారెడ్డిని పార్టీ మరొద్ధని చెప్పానన్నారు. పార్టీలో అంతర్గత సమస్యలు సహజమని, తర్వాత పార్టీ పొలిటికల్ అఫైర్స్‌లో చర్చిద్దామని చెప్పానన్నారు. జగ్గారెడ్డి తన మాట వింటారని అనుకుంటున్నానన్నారు. అయినా కాంగ్రెస్‌లో ఏకపక్ష నిర్ణయాలు జరుగుతున్నాయని, తనపై సైతం తప్పుడు ప్రచారం జరుగుతోందని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు.

Updated Date - 2022-02-19T18:11:20+05:30 IST