హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందని ఆ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ కొత్త పీసీసీకి, కోమటిరెడ్డికి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ త్వరలో పోతుందన్నారు. అందు కోసం తాము ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. టీపీసీసీ చీఫ్గా రేవంత్ ఏ ఆదేశం ఇచ్చినా ఫాలో అవుతామని స్పష్టం చేశారు. వైఎస్ ఆత్మీయ సమ్మేళనానికి కోమటిరెడ్డి వెళ్లడం తప్పుకాదని సమర్ధించారు. చంద్రబాబుకు సీతక్క రాఖీ కట్టడం కూడా తప్పు కాదన్నారు. పీసీసీ మీద ఎవరు కామెంట్ చేసినా సమర్దించనన్నారు.
కోమటిరెడ్డికి టీపీసీసీ రాలేదన్న బాధలో మాట్లాడుతున్నట్లు ఉన్నారని జగ్గారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నుంచి రావొద్దు అనడం సరికాదన్నారు. పార్టీ మీద ఇష్టం లేకపోతే కోమటిరెడ్డి కాంగ్రెస్లో ఉండలేరని, కాంగ్రెస్ పార్టీలో చిన్న చిన్న సమస్యలు రావడం సర్వసాధారణమన్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తన పూర్తి మద్దతు ఉంటుందని జగ్గారెడ్డి స్పష్టం చేశారు.