త్వరలో జగదీశ్‌రెడ్డి అవినీతి చిట్టా విప్పుతా

ABN , First Publish Date - 2022-08-16T07:51:29+05:30 IST

రాజకీయాలను అడ్డం పెట్టుకొని తాను అవినీతికి పాల్పడినట్టు, కాంట్రాక్టులు పొందినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని..

త్వరలో జగదీశ్‌రెడ్డి అవినీతి  చిట్టా విప్పుతా

మంత్రి, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలి

నా అవినీతిని నిరూపిస్తే రాజకీయ సన్యాసం

మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సవాల్‌


చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 15: రాజకీయాలను అడ్డం పెట్టుకొని తాను అవినీతికి పాల్పడినట్టు, కాంట్రాక్టులు పొందినట్టు నిరూపిస్తే ఎన్నికల్లో పోటీ చేయనని.. రాజకీయ సన్యాసం తీసుకుంటానని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. సోమవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అమిత్‌షా మీటింగ్‌పై నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. మంత్రి జగదీశ్‌రెడ్డి అవినీతి అక్రమాలు, నేర చరిత్రపై త్వరలో చిట్టా విప్పుతానని చెప్పారు. అప్పుడు ఆయన మంత్రి పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజకీయంగా ఎదుర్కోలేక తన వ్యక్తిగత ఇమేజ్‌ను దెబ్బతీసేలా మంత్రితో పాటు, కొందరు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మంత్రి అయిన తర్వాత జగదీశ్‌రెడ్డి వెయ్యి కోట్ల అవినీతికి పాల్పడ్డాడని ఆరోపించారు. ఆయనపై అనేక హత్య కేసులున్నాయని, జైలుకు వెళ్లాడని, 14 ఏళ్లు కోర్టుల చుట్టూ తిరిగాడని ఆరోపించారు. శంషాబాద్‌లో 70 ఎకరాల్లో ఫామ్‌హౌస్‌, నాగారంలో ఐదు ఎకరాల్లో ఇల్లు నిర్మించుకున్నాడని, బినామీల పేరుతో కోట్ల అస్తులు కూడబెట్టుకున్నాడని ఆరోపించారు. తాను 2009 సంవత్సరం తర్వాత ఉన్న ఆస్తులు అమ్ముకున్నానని తెలిపారు.


35 ఏళ్ల క్రితమే తనకు కంపెనీ ఉందని, ఆ కంపెనీ సొమ్ములో కొంత పేదలకు దానం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం తన కుమారుడు కంపెనీ వ్యవహారాలు చూసుకుంటున్నాడని తెలిపారు. ‘తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన నువ్వు సూర్యాపేట నుంచి వచ్చి ఇక్కడ రౌడీయిజం ప్రదర్శిస్తే మునుగోడు ప్రజలు ఊరుకోరు. సంస్కారం లేని వ్యక్తివి నీవు. నాకు సంస్కారం లేదని మాట్లాడతావా?’ అని విమర్శించారు. మంత్రి ప్రలోభాలకు గురిచేస్తూ రూ.20 లక్షలు ఇచ్చి సర్పంచ్‌లను కొనుగోలు చేస్తున్నాడని, మంత్రి వ్యవహారాలను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా విజయం మునుగోడు ప్రజలదేనన్నారు. తన రాజీనామాతో కేసీఆర్‌కు నిద్రపట్టడం లేదని, మునుగోడు ఉప ఎన్నికపైనే తెలంగాణ భవిష్యత్తు అధారపడి ఉందన్నారు. లక్ష మందితో 21న మునుగోడులో బహిరంగసభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఆ తర్వాత చౌటుప్పల్‌-తంగడపల్లి రోడ్డును పరిశీలించారు. సమావేశంలో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-16T07:51:29+05:30 IST