జగనన్న దగా దీవెన: టీడీపీ

ABN , First Publish Date - 2021-07-31T07:47:53+05:30 IST

రాష్ట్రంలోని విద్యార్థులను జగనన్న విద్యాదీవేన పేరుతో సీఎం దగా చేస్తున్నారని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ ఆరోపించారు.

జగనన్న దగా దీవెన: టీడీపీ
ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతున్న నరసింహ యాదవ్

తిరుపతి(తిలక్‌రోడ్డు), జూలై 30: రాష్ట్రంలోని విద్యార్థులను జగనన్న విద్యాదీవేన పేరుతో  సీఎం దగా చేస్తున్నారని తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌ ఆరోపించారు. విద్యాదీవెన కాదు.. దగా దీవెన అని విమర్శించారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 16లక్షల మంది విద్యార్థులకు ఫీజు  రీయింబర్స్‌మెంట్‌ చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం 11 లక్షలమందికి ఇచ్చి 5లక్షల మంది విద్యార్థులకు అన్యాయం చేసిందన్నారు. జీవో 77ను రద్దుచేసి, పీజీ విద్యార్థులకు జగనన్న విద్యాదీవేన వర్తింపజేయాలన్నారు.  రాష్ట్రంలో ఒక కొత్త పరిశ్రమనూ ప్రభుత్వం తీసుకు రాకపోగా.. ఉన్న వాటిని వేధించడంతో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయాయని విమర్శించారు. జాబ్‌లెస్‌ క్యాలండర్‌తో నిరుద్యోగులపై కపటప్రేమ చూపుతున్నారని ఆరోపించారు. టీడీపీ హయంలో ఆరు లక్షల మంది నిరుద్యోగులకు ప్రతినెలా రూ2వేలు చొప్పున భృతి ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా రైతులు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగులను సీఎం జగన్‌ మోసం చేస్తున్నారని కొర్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ ఆరోపించారు. విద్యాదీవేనపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ఈ సమావేశంలో టీడీపీ మీడియా కో-ఆర్డినేటర్‌ శ్రీధర్‌వర్మ, కార్యాలయ కార్యదర్శి, మనోహర్‌ఆచ్చారి, వైనం బాలాజీ, రాజయ్య, తిరుపతి నగర టీఎన్‌టీయూసీ అధ్యక్షుడు టి.సి.రెడ్డెప్పనాయుడు, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు వెంకటేష్‌యాదవ్‌, జ్ఞానశేఖర్‌, అబ్దుల్‌హుసేన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-31T07:47:53+05:30 IST