‘జగనన్న మీకు నమస్తే.. విద్యాదీవెన డబ్బులు పడలేదు.. అందుకే పుస్తెలు తాకట్టు పెడుతున్నా..’
ABN , First Publish Date - 2021-11-17T14:36:13+05:30 IST
ఫీజుల కోసం..
ఫీజుల కోసం పుస్తెలు తాకట్టు
జగనన్న వసతి దీవెన ఎక్కడంటూ ప్రశ్న
కలకలం సృష్టించిన మహిళ.. వీడియో వైరల్
రాపూరు(నెల్లూరు): విద్యార్థుల సంక్షేమానికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందకపోవడంతో తన కుమారుడి ఫీజు చెల్లించేందుకు పుస్తెలు తాకట్టు పెట్టాల్సి వచ్చిందంటూ నెల్లూరు జిల్లా రాపూరు పట్టణానికి చెందిన కొండాపురం కస్తూరి ఆవేదన వ్యక్తం చేసింది. మంగళవారం ఆమె.. రాపూరు ఏపీజీబీలో తన మంగళసూత్రాన్ని తాకట్టుపెడుతున్నానంటూ బయటకు తీసి చూపించి కలకలం రేపింది. ఈ విషయంపై కస్తూరి మాట్లాడుతూ తన కుమారుడు విద్యానగర్లోని ఎన్బీకేర్ కళాశాలలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నాడని, జగనన్న విద్యాదీవెన డబ్బులు పడకపోవడంతోనే పుస్తెలు తాకట్టు పెట్టాల్సి వస్తోందని తెలిపింది. జగనన్న పథకాలు ఎంత బాగా అమలవుతున్నాయో తన పరిస్థితిని చూస్తే అర్థమవుతుందని విమర్శించింది. ‘జగనన్న మీకు నమస్తే.. వైసీపీ నాయకుల్లారా మీకు వేల కోట్ల దండాల’ంటూ ఎద్దేవా చేసింది. ఈ వీడియో వైరల్ కావడంతో చర్చనీయాంశంగా మారింది.