పేదోడిపై వడ్డన
ABN , First Publish Date - 2021-10-28T05:45:02+05:30 IST
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో ప్రభుత్వ గృహ లబ్ధిదారుల వివరాలు సేకరణ ప్రారంభమైంది. పది రోజులుగా సచివాలయ సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు.
ఇళ్ల బకాయిల వసూళ్లకు కసరత్తు
1986–2011 మధ్య లబ్ధిదారుల సర్వే
సమాచార సేకరణలో వలంటీర్లు
భీమవరం, అక్టోబరు 27 : జగనన్న సంపూర్ణ గృహ హక్కు పేరుతో ప్రభుత్వ గృహ లబ్ధిదారుల వివరాలు సేకరణ ప్రారంభమైంది. పది రోజులుగా సచివాలయ సిబ్బంది ఈ పనిలో నిమగ్నమయ్యారు. వివరాల సేకరణలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1986–2011 మధ్య ప్రభుత్వం ఇచ్చిన ఇళ్లకు సంబంధించి బకాయిల వసూళ్లలో భాగంగా వలంటీర్లు ఇంటింటికీ తిరుగుతున్నారు. వన్టైమ్ సెటిల్మెంట్ చేసుకో మంటూ లబ్ధిదారులకు సూచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ బకాయిదారుల జాబితాలను గ్రామ సచివాలయం, వార్డు సచివాలయాలకు పంపించింది. ఆ జాబితాల ఆధారంగా తొలిదశలో వార్డు వలంటీర్లు ఇంటింటికి తిరుగుతున్నారు. ఆ ఇంటి యజమాని ఆనాటి లబ్ధిదారుడా ? వేరే వారికి అమ్ముకుంటే అతని వివరాలు నమోదు చేస్తున్నా రు. తరువాత యజమాని లభిస్తే త్వరలో వన్టైమ్ సెటిల్మెంట్ ఆదేశాలు వస్తాయని అందుకు రూ.10 నుంచి 20 వేల వరకు పలు కేటగిరీలలో బకాయిల సొమ్ము చెల్లిస్తే సరిపోతుందని చెబుతున్నారు. వారిచ్చిన చిరునామా ఆధారంగా వార్డు సచివాలయ అధికారులు వెళ్లి ఆ ఇల్లు ఎన్ని సెంట్లలో నిర్మించారు ? ఆ భూమి వివరాలను మార్కింగ్ చేస్తున్నారు. తరువాత ఇంజనీరింగ్ సిబ్బంది వెళ్లి కొలతలు వేసి లబ్ధిదారుల వివరాలతో ఒక నివేదిక తయారు చేస్తున్నారు. ఆ జాబితాలు 25 ఏళ్ల నాటివి కావడంతో చిరునామాలు దొరక్క అవస్థలు పడుతున్నారు. భీమవరం మునిసిపాలిటీలో 3,500 లబ్ధిదారుల పేర్ల జాబితా వస్తే 1,800 మంది చిరునామాలు మాత్రమే లభించాయి. యజమానులు లేకపోవడం, అప్పటి వార్డులు ఇప్పుడు మారిపోవడం వంటి పరిస్థితులు ఎదురవు తున్నాయి. రెవెన్యూశాఖ, మునిసిపాలిటీల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వలంటీర్లు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు.
‘ఇంటి బకాయిలు చెల్లించాలంటూ వలంటీర్లు మా ఇంటికి వ చ్చారు. 1996లో ఇల్లు నిర్మించుకున్నా.. అప్పట్లో రూ.25 వేలు ఖర్చయ్యింది. అప్పటి నుంచి బకాయిల వసూలుకు రాలేదు. ఇప్పడు వచ్చి వన్టైమ్ సెటిల్మెంట్ చేసుకోవాలని చెప్పారు. బకాయిలు రద్దు చేస్తే మావంటి పేదలకు బాగుంటుంది’ అని భీమవరం 39వ వార్డుకు చెందిన దేవర అక్కిరాజు కోరుతున్నారు.