విద్యార్థులకు అందని జగనన్న గోరుముద్ద
ABN , First Publish Date - 2021-05-11T14:58:10+05:30 IST
కరోనా ప్రభావం.. విద్యార్థులకు అందించే...
అసలే కరోనా.. ఆపై ఆర్థిక ఇబ్బందులు
మచిలీపట్నం: కరోనా ప్రభావం.. విద్యార్థులకు అందించే గోరుముద్ద కార్యక్రమాన్ని ప్రభావితం చేసింది. జిల్లాలో విద్యార్థులకు గొప్పగా ఇస్తామన్న గోరుముద్ద అమలుకు నోచుకోవడం లేదు. లాక్డౌన్ కారణంగా పాఠశాలలు మూతపడటంతో విద్యార్థులకు డ్రై రేషన్ అందించారు కానీ గోరముద్ద అమలుకు నోచుకోవడంలేదు. జిల్లాలో దాదాపు 3లక్షల 28వేల మంది విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకం అందించాల్సి ఉంది. 3 లక్షల మంది మాత్రమే భోజనం చేస్తున్నారు. కొవిడ్ కారణంగా ఈ విద్యా సంవత్సరం 2020 నవంబరులో మొదలయింది. 9, 10 తరగతులకు మిడ్ డే మీల్స్ అమలు చేశారు. మిగిలిన వారికి ఇంటికే డ్రై రేషన్ పంపారు. 2021 ఫిబ్రవరి నుంచి పాఠశాలలు తెరవడంతో డ్రై రేషన్ ఆపివేసి మధ్యాహ్న భోజన పథకం కొనసాగించారు. మళ్లీ కరోనా విలయతాండవం చేయడంతో ఏప్రిల్ 20 నుంచి పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. దీంతో మళ్లీ మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. విద్యార్థులకు అందాల్సిన డ్రై రేషన్ ఇవ్వటంలేదు. ప్రభుత్వం తగిన మార్గదర్శక సూత్రాలు అందించలేదు. దీంతో విద్యార్థులు డ్రై రేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పక్క కరోనాతో ప్రజలు ఆర్ధిక ఇబ్బందులకు గురవుతున్నారని, వెంటనే డ్రై రేషన్ అందజేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.