నవ్వులపాలైన జగనన్న వీధి లైట్ల పథకం
ABN , First Publish Date - 2021-11-25T06:36:11+05:30 IST
జగనన్న పల్లెవెలుగు పథకం చీకట్లో మగ్గిపోతోంది. ప్రస్తుతం ఒక వీధి లైటు కూడా వెలిగించలేని పరిస్థి తిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో కొత్త వెలుగులు నింపాలనే ఆలోచనతో ఎల్ఈడీ వీధిలైట్ల పథకం అమలులోకి తెచ్చింది. కేంద్ర విద్యుత్శాఖ అ
ఇంతవరకూ ఒక్క బల్బు కూడా ఇవ్వని ప్రభుత్వం
ఇక పంచాయతీలే బాధ్యత.. కానీ అందని సర్క్యులర్
ఎవరైనా వీధి లైట్లు అడిగితే బల్బు ఇస్తే వెలిగిస్తామంటున్న సిబ్బంది
(రాజమహేంద్రవరం - ఆంధ్రజ్యోతి)
జగనన్న పల్లెవెలుగు పథకం చీకట్లో మగ్గిపోతోంది. ప్రస్తుతం ఒక వీధి లైటు కూడా వెలిగించలేని పరిస్థి తిలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం గ్రామాల్లో కొత్త వెలుగులు నింపాలనే ఆలోచనతో ఎల్ఈడీ వీధిలైట్ల పథకం అమలులోకి తెచ్చింది. కేంద్ర విద్యుత్శాఖ అనుబంధ సంస్థ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏజన్సీలు గ్రామాల్లో ఎల్ఈడీలతో వీధిలైట్లు వెలిగిస్తారు. లైట్లు వేయడం, మరమ్మతులు కూడా వారే చేసేవారు. ఇది కొంతకాలం బాగానే జరిగింది. కానీ బల్బు కావాలంటే పంచాయతీరాజ్ కమినర్ అనుమతి కావలసి వచ్చేది. ఏదోలా బాగానే జరుగుతుండగా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పథకాన్ని చాలాకాలం మూలన పడేశారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజలు వీధిలైట్ల కోసం లేఖలు రాసినా స్పందన లేని పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి రెండున్నర ఏళ్లు దాటుతున్నా వీధుల్లో కొత్తగా ఒక బల్బు కూడా వేయలేదు. ఎట్టకేలకు గత జూన్లో పాత ఏజన్సీకే బాధ్యతలు అప్పగిస్తూ అన్ని పంచాయతీల్లోనూ కొన్ని బల్బులు, ఇతర విద్యుత్ సామాన్లు స్టోర్ చేసుకోవడానికి ప్రత్యేక అలమార్లు నిర్మించాలని పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశించారు. వాటికి కొలతలు కూడా నిర్దేశించారు. మొత్తం డివిజన్ స్థాయిలో ఒక గోడౌన్ కూడా ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. చివరకూ ఇవి కూడా మూలనపడ్డాయి. ఏదో కొత్త విధానం అంటూ తతంగం చేయడమేతప్ప బల్బులు ఇచ్చే విధానం మాత్రం రాలేదు.
జిల్లాలోని 1100లకుపైగా ఉన్న గ్రామ పంచాయతీలన్నింటిలోనూ బల్బుల కొరత ఉంది. ఒక బల్బు పోతే మరో బల్బు వేసే పరిస్థితి లేదు. గ్రామాల్లో సొమ్ములు కూడా లేవు. ఈనేపఽథ్యంలో ఎవరైనా వీధిలైట్ల గురించి అడిగితే బల్బు ఇస్తే వెలిగిస్తామని కొందరు లైన్మెన్లు చెబుతుండడం గమనార్హం. అధికార్లకు చెప్పినా ఎవరూ ఏమీ చేయచేయలేకపోతున్నారు. ఇటీవల వీధి లైట్ల బాధ్యతను పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఓ సర్క్యులర్ చేసింది. కానీ అది ఇంకా పంచాయతీలకు చేరలేదు. దీని ప్రకారం జిల్లా స్థాయి కొనుగోలు కమిటీ ఉంటుంది. జిల్లా జాయింట్ కలెక్టర్ చైర్మన్గా ఈ కమిటీ ఉంటుంది. డీపీవో తదితరులు సభ్యులుగా ఉంటారు. ఈ కమి టీ ధరలు నిర్ణయిస్తుంది. ఈఎల్డీ బల్బులు, అవి అమ ర్చడానికి అవసరమైన సామాన్లు, వైరు తదితర సామాన్లకు ధరలు నిర్ణయించి గ్రామాలకు పంపుతుంది. వాటి ప్రకారం గ్రామ పంచాయతీలే ఇక బల్బులు కొనుగోలు చేయవచ్చు. కానీ దానికి సంబంధించి ఇంతవరకూ ధరలు నిర్ణయించలేదు. సుమారు రెండున్నర ఏళ్ల నుంచి ఒక్క బల్బు కూడా ఇవ్వకపోగా, ఎట్టకేలకు పంచాయతీలనే కొనుగోలు చేయమని చెప్పినప్పటికీ, ఇప్పటికీ ధరలు నిర్ణయించకపోవడంతో మరింత ఆలస్యం అవుతోంది. శీతాకాలం సాయంకాలం ఐదు గంటలకే చీకటి పడిపోతుంది. పైగా చలి ఎక్కువ. ఈ పరిస్థితుల్లోనూ వీధి లైట్లు లేకపోతే ప్రజలు మరిన్ని ఇక్కట్లు పడతారు.