జగన్ బలహీనత విస్తరణలో బయటపడుతోంది: వర్ల రామయ్య
ABN , First Publish Date - 2022-04-10T08:54:04+05:30 IST
ఎవరినీ లెక్కచేయనని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బలహీనత మంత్రివర్గ విస్తరణలో బయట పడుతోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు.
అమరావతి, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి): ఎవరినీ లెక్కచేయనని చెప్పుకొనే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి బలహీనత మంత్రివర్గ విస్తరణలో బయట పడుతోందని తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. మంత్రివర్గ విస్తరణ పద్మవ్యూహంలో ముఖ్యమంత్రి చిక్కుకుపోయారని, బలమైన మంత్రుల జోలికి వెళ్లలేక, ఉంచలేక సతమతమవుతున్నారని విమర్శించారు. శనివారం ఆయన ఒక ప్రకటన చేశారు. ‘‘రెండున్నరేళ్ల తర్వాత మంత్రులందరినీ తొలగించి కొత్తవారికి అవకాశం ఇస్తానని ముఖ్యమంత్రి అయిన కొత్తలో జగన్రెడ్డి ఘనంగా చెప్పారు. ఇప్పుడు ఆ మాట నిలుపుకొనే ధైర్యం ఆయనలో కొరవడింది. నలుగురైదుగురు పాత వాళ్లను కొనసాగిస్తానని మంత్రివర్గ సమావేశంలో చెప్పారు. ఏడు నుంచి 10 మందిని కొనసాగిస్తామని ఆయన తన సొంత పత్రికలో తర్వాత రాయించుకొన్నారు. పాతుకుపోయిన వారిని పీకలేని అసమర్థతతో ఆయన ఉన్నారు’’ అని వర్ల విమర్శించారు.