ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

ABN , First Publish Date - 2021-03-02T22:19:50+05:30 IST

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.

ఢిల్లీకి వెళ్లనున్న సీఎం జగన్

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరారు. అపాయింట్‌మెంట్‌ ఖరారైతే ఇవాళ సాయంత్రం లేదా బుధవారం ఢిల్లీ పర్యటనకు సీఎం వెళ్లనున్నారు. నిజానికి ఈ నెల 4న అమిత్ షా నేతృత్వంలో తిరుపతిలో సదరన్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉంది. అయితే అనివార్య కారణాలవల్ల ఆ సమావేశం వాయిదా పడింది. ఆ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలను అమిత్ షాను కలిసి విన్నవించుకోవాలని సీఎం జగన్ భావించారు. ఈ నేపథ్యంలో  ఏపీ సీఎంవో ప్రధాని మోదీ, అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ కోరినట్లు తెలియవచ్చింది.


గత జనవరిలో హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆనాటి ఢిల్లీ పర్యటనలో ఇరువురి మధ్య చాలా విషయాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. ముఖ్యంగా ఆలయాలపై దాడులు, జమిలీ ఎన్నికలు తదితర అంశాలను చర్చించినట్టు అప్పట్లో ఢిల్లీ వర్గాలు తెలిపాయి. తాజాగా మరోసారి సీఎం జగన్ ఢిల్లీకి వెళుతుండటం వెనక... కారణాలు ఏమై ఉంటాయన్న దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. రాజకీయ ఎజెండాతోనే వెళుతున్నారా లేక రాష్ట్ర ఆర్థిక అంశాలపై చర్చిస్తారా అన్నది తెలియాల్సి ఉంది.  

Updated Date - 2021-03-02T22:19:50+05:30 IST