వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించిన సీఎం జగన్

ABN , First Publish Date - 2020-08-12T17:12:02+05:30 IST

వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు.

వైఎస్సార్ చేయూత పథకం ప్రారంభించిన సీఎం జగన్

అమరావతి: వైయస్‌ఆర్‌ చేయూత పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ పథకం ప్రారంభించడం చాలా సంతోషంగాను, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ పథకం 45 నుంచి 60 ఏళ్ల వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు లబ్ది చేకూరుతుందన్నారు. 60 ఏళ్లు దాటినవారికి వర్తించదన్నారు. ఈ పథకం బుధవారం నుంచే అమలవుతుందని, లబ్దిదారుల ఖాతాల్లో రూ.18,750 ప్రభుత్వం జమచేస్తున్నారు.


చేయూత కింద వచ్చే 4 ఏళ్లలో రూ. 75 వేలు సాయం చేస్తామని సీఎం జగన్‌ చెప్పారు. ఈ పథకం ద్వారా సుమారు 20 లక్షల మంది మహిళలకు లబ్ది చేకూరుతుందన్నారు. చేయూత పథకం కోసం రూ. 4,700 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ఆర్థిక సహాయాన్ని పెట్టుబడిగా మార్చుకుని స్వయం ఉపాధి పొందే అవకాశమన్నారు. ప్రభుత్వ సహకారంతో సొంత కాళ్ళ మీద నిలబడాలనుకునే వారికి ఈ పథకం చేయూత ఇస్తుందన్నారు. పాత అప్పులకు జమ చేసుకోకుండా ఉండేలా నగదు ఇస్తామన్నారు.


మహిళలకు శిక్షణ, సాంకేతిక, మార్కెటింగ్‌ వంటి అంశాల్లో పలు సంస్థలు సాయం చేస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. మహిళలకు ఆర్ధిక స్వావలంబన కోసమే చేయూత పథకం అమలు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పింఛన్‌ తీసుకుంటున్న మహిళలకు కూడా ఈ పథకంలో అవకాశం ఉంటుందన్నారు. పెన్షన్‌ అందుకుంటున్న వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, చేనేత, గీత, మత్స్యకార మహిళలకు కూడా ఈ పథకం ద్వారా లబ్ది చేకూరుతుందన్నారు. వచ్చే నాలుగేళ్ల పాటు ఈ చేయూత పథకం అమల్లో ఉంటుందన్నారు. లబ్దిదారుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ అవుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు.

Updated Date - 2020-08-12T17:12:02+05:30 IST