‘మా సీఎం జగన్ జైలుకెళ్లాడు.. నేనూ జైలు కెళ్లడానికైనా సిద్ధమే’

ABN , First Publish Date - 2022-01-02T22:24:13+05:30 IST

పాయకరావుపేట వైసీపీలో కుమ్ములాటలు రోజురోజుకు ముదురుతున్నాయి. వైసీపీ నేతలపై కార్యకర్తలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు.

‘మా సీఎం జగన్ జైలుకెళ్లాడు.. నేనూ జైలు కెళ్లడానికైనా సిద్ధమే’

విశాఖ: పాయకరావుపేట వైసీపీలో కుమ్ములాటలు రోజురోజుకు ముదురుతున్నాయి. వైసీపీ నేతలపై కార్యకర్తలు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. బాబూరావు తీరుపై సొంత పార్టీ నేతలే భగ్గుమన్నారు. బాబూరావుకు వ్యతిరేకంగా అధికార పార్టీకి చెందిన  జడ్పీటీసీ, పలువురు సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, మాజీ సర్పంచులు, నేతలు ఏకమవుతున్నారు. ఆయన కోసం ఎన్నికల్లో కష్టపడి పనిచేసిన తమను చాలా హీనంగా చూస్తున్నారని మండిపడుతున్నారు. ఇటీవల నేతలంతా సమావేశమై బాబూరావు ముఖం చూడబోమంటూ ప్రతిజ్ఞ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎమ్మెల్యే బాబూరావుపై ఎస్‌.రాయవరం ఎంపీటీసీ బొలిశెట్టి గోవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చేయి తడపనిదే ఎమ్మెల్యే బాబురావు ఏ పనీ చేయరని మండిపడ్డారు. ప్రతి పనికీ ఓ రేటు కట్టి బేరం కుదుర్చుకుంటారని ఆరోపించారు. కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. ‘‘మా సీఎం జైలుకెళ్లాడు.. నేనూ జైలు కెళ్లడానికైనా సిద్ధమే’’ అని బొలిశెట్టి గోవింద్ స్పష్టం చేశారు. 


ఒకవైపు నియోజకవర్గ కేంద్రమైన పాయకరావుపేటలో ఎమ్మెల్యే బాబూరావు అధికారగణంతో నియోజకవర్గ స్థాయి సమీక్ష జరుపుతున్న సమయంలోనే ఎస్‌.రాయవరం మండలంలో వైసీపీ నేతలు అసమ్మతి గళం విప్పారు. ఎవరైనా రూ.వంద కోట్లు ఇస్తానన్నా మరొకరి వాహనం నడపనని, కానీ జగన్‌ సీఎం కావాలన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో  బాబూరావుకు డ్రైవర్‌గా పనిచేశానని ఎస్‌.రాయవరం ఎంపీటీసీ సభ్యుడు బొలిశెట్టి గోవింద్‌ తెలిపిన విషయం తెలిసిందే. కష్టకాలంలో రూ.3 కోట్లు అప్పు తీర్చానని, అటువంటి తనను ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత బాబూరావు పురుగులా చూస్తున్నారని వాపోయారు. మళ్లీ తాను ఎమ్మెల్యే ముఖం చూడనని గోవింద్‌ ప్రతినబూనారు.

Updated Date - 2022-01-02T22:24:13+05:30 IST