రెండేళ్ల ముందే జనంలోకి జగన్‌!

ABN , First Publish Date - 2022-04-26T08:51:36+05:30 IST

అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు.

రెండేళ్ల ముందే జనంలోకి జగన్‌!

  • జిల్లాల పర్యటనకు సమాయత్తం
  • రేపు వైసీపీ జిల్లాల అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలతో భేటీ


అమరావతి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలు ఇంకా రెండేళ్లు ఉన్నప్పటికీ.. ఇప్పటి నుంచే ప్రచారానికి శ్రీకారం చుట్టాలని సీఎం జగన్మోహన్‌రెడ్డి భావిస్తున్నారు. నవరత్నాల అమలు మాటెలా ఉన్నా.. ప్రభుత్వం పన్నుల రూపంలో భారీగా వడ్డిస్తోందని ప్రజలు రగిలిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేగాక.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో ఆశించిన రాజకీయ ప్రయోజనం నెరవేరకపోగా.. పార్టీ ఎమ్మెల్యేల్లో తీవ్ర అసంతృప్తి నెలకొనడంతో దీనిని అధిగమించేందుకు రానున్న రెండేళ్లూ జనంలోకి వెళ్లాలని.. జిల్లాల పర్యటన చేపట్టాలని నిశ్చయించారు. ఇందులో భాగంగా బుధవారం మధ్యాహ్నం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మంత్రులు, వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి జిల్లాల పర్యటన.. మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలూ ఇంటింట ప్రచారంపై దృష్టి సారించనున్నట్లు వైసీపీ వర్గాలు తెలిపాయి.


2019 సార్వత్రిక ఎన్నికలకు రెండేళ్లు ముందుగానే.. 2017లో పార్టీ ప్లీనరీని గుంటూరులో నిర్వహించి.. ఆ వెంటనే జగన్‌ పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు కూడా రెండేళ్ల ముందే జిల్లాల పర్యటన పేరిట.. ముందస్తు ఎన్నికల ప్రచారం చేపట్టే యోచనలో ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా.. నవరత్న పథకాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని గత నెలలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో, పార్టీ శాసనసభాపక్ష భేటీలో జగన్‌ నిర్దేశించారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా అధ్యక్షులూ ఉగాది నుంచి పథకాలపై ఇంటింటా ప్రచారం చేయాలని ఆదేశించారు. ఈ ప్రచారంలో వలంటీర్లను కలుపుకొని వెళ్లాలని తెలిపారు. ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంటే ఎవరినైనా పక్కకు నెట్టేస్తానని.. గెలిచేవారికే టికెట్లు ఇస్తానని స్పష్టం చేశారు. ఇది మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఆందోళన కలిగించింది. ఈ నెల 11వ తేదీన జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవులు కోల్పోయినవారు, ఆశించినవారు తీవ్ర నిరాశానిస్పృహలకు లోనయ్యారు. వచ్చే ఎన్నికల్లో తమకు టి కెట్లు దక్కుతాయో లేదో తేల్చుకున్నాకే జనంలోకి వెళ్లాలని భావిస్తున్నారని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.

Updated Date - 2022-04-26T08:51:36+05:30 IST