Minister కొడాలి నానితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు..

ABN , First Publish Date - 2021-11-24T19:36:02+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై..

Minister కొడాలి నానితో పాటు ముగ్గురు ఎమ్మెల్యేలకు భద్రత పెంపు..

అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబంపై.. అధికార వైసీపీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అనుచిత వ్యాఖ్యలతో రాష్ట్రం అట్టుడుకుతున్న సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు, ప్రజా సంఘాలు సైతం నిరసనకు దిగాయి. ఎవరైతే చంద్రబాబుపై ఈ వ్యాఖ్యలు చేశారో వారిపై కొందరు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులకు సైతం పాల్పడ్డారు. ఈ క్రమంలో జగన్ సర్కార్ స్పందించి మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలకు భద్రత పెంచుతున్నట్లు ప్రకటించింది.


భద్రత లెక్కలివీ..!

మంత్రి కొడాలి నానీకి ప్రస్తుతం ఉన్న 2+2 గన్‌మెన్లతో పాటు అదనంగా 1+4 గన్ మెన్లను భద్రతగా ప్రభుత్వం ఇచ్చింది. అంతేకాదు.. కాన్వాయ్‌లో అదనంగా మరో భద్రతా వాహనాన్ని కూడా ప్రభుత్వం కల్పించింది. ఇకపై కొడాలి నానికి 7+7 భద్రత ఉండనుంది. మరోవైపు.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్‌లకు కూడా ప్రస్తుతం ఉన్న 1+1 గన్‌మెన్‌లతో పాటు అదనంగా 3+3 గన్‌మెన్ భద్రతను ప్రభుత్వం ఇచ్చింది. ఇకపై ఈ ముగ్గురు ఎమ్మెల్యేలకు 4+4 భద్రత ఉండనుంది. ఇదిలా ఉంటే.. చంద్రబాబుపై వ్యాఖ్యల అనంతరం సామాజిక మాధ్యమాల్లో వారికి బెదిరింపులు వచ్చినట్టుగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం వారి భద్రతను సెక్యూరిటీ రివ్యూ కమిటీ సమీక్షించింది. అనంతరం తక్షణం భద్రత కల్పిస్తూ ప్రభుత్వం ఇవాళ ఈ నిర్ణయం తీసుకుంది.



Updated Date - 2021-11-24T19:36:02+05:30 IST