జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా
ABN , First Publish Date - 2021-03-04T07:07:55+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ రెండు రోజులు ప్రయత్నించినా దొరకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది.
దొరకని షా, మోదీ అపాయింట్మెంట్
న్యూఢిల్లీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్షా అపాయింట్మెంట్ రెండు రోజులు ప్రయత్నించినా దొరకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. అపాయింట్మెంట్ను బట్టి బుధవారం లేక గురువారం అమిత్షాతో భేటీ కావాలని జగన్ భావించారు. వీలుచిక్కి ప్రధాని మోదీ అవకాశమిస్తే ఆయననూ కలిసి రావాలని ఆయన ఆలోచించినట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం ఐదు రాష్ర్టాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలై, మోదీ, అమిత్షాలు ఆ హడావుడిలో ఉన్నారు. ఆ తేదీల్లో సమయం కేటాయించలేమని హోమ్, పీఎం కార్యాలయాల అధికారులు... ఏపీభవన్ అధికారులకు బుధవారం సాయంత్రం స్పష్టం చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అయితే, వచ్చే వారం లోపు వారిద్దరి అపాయింట్మెంట్ ఇప్పించాలని ఏపీ భవన్ అధికారులు కోరినట్లు చెబుతున్నారు. ఐదవ తేదీ, ఆ తర్వాత ఏ రోజు సమయం కేటాయించినా సీఎం జగన్ ఢిల్లీ వస్తారని తెలిపినట్లు తెలిసింది. మోదీ, అమిత్షాతో ముఖ్యమంత్రి భేటీ ప్రక్రియ తాత్కాలికంగానే వాయిదాపడిందని, త్వరలో ఖరారు అవుతుందని ఒక అధికారి తెలిపారు.