నవరత్నాలు రాజ్యాంగ విరుద్ధం: చింతా మోహన్
ABN , First Publish Date - 2021-10-12T01:13:01+05:30 IST
రాష్ట్రంలో అమలు చేస్తోన్న నవరత్నాలు రాజ్యాంగ విరుద్ధమని, నవరత్నాల పేరుతో ప్రజల నవరంధ్రాలు మూసివేస్తున్నారని
గుంటూరు: రాష్ట్రంలో అమలు చేస్తోన్న నవరత్నాలు రాజ్యాంగ విరుద్ధమని, నవరత్నాల పేరుతో ప్రజల నవరంధ్రాలు మూసివేస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ ధ్వజమెత్తారు. సోమవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అంధకారంలోకి పోతుందని, వచ్చే నెలలో విద్యుత్ ఉంటుందో లేదో తెలియదని, ఇంకెంత కోతలు ఉంటాయో చూడాలన్నారు. రాష్ట్రంలో 80 లక్షల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు స్కాలర్షిప్పులు, ఫీజు రీయింబర్స్మెంట్, మెస్ ఛార్జీలు రెండేళ్ళ నుంచి చెల్లింపులు లేవన్నారు. పేద విద్యార్థులు చదువుకోవాలంటే అష్టకష్టాలు పడాల్సి వస్తోందన్నారు. ఇప్పుడున్న రాజకీయ నేతలు, ఐఏఎస్, ఐపీఎస్లు గతంలో స్కాలర్షిప్పులు తీసుకున్నవారెందరో ఉన్నారన్నారు. ఇక రైతు ఆత్మహత్యలతో పాటు విద్యార్థుల ఆత్మహత్యలు ప్రారంభమవుతాయని చింతా మోహన్ ఆందోళన వ్యక్తం చేశారు.