అందుకే KCR కొత్త పార్టీ ఆలోచన: Jagadish Reddy
ABN , First Publish Date - 2022-06-15T21:46:32+05:30 IST
దేశాభివృద్ధిలో జాతీయ పార్టీలు విఫలం అయినందునే సీఎం కేసీఆర్ కొత్త పార్టీ ఆలోచన అని...
Suryapeta: దేశాభివృద్ధిలో జాతీయ పార్టీలు విఫలం అయినందునే సీఎం కేసీఆర్ (CM KCR) కొత్త పార్టీ ఆలోచన చేస్తున్నారని మంత్రి జగదీష్రెడ్డి (Jagadish Reddy) అన్నారు. టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితి (BRS) పార్టీగా మారే అంశంపై స్పందించిన ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీలు దేశ భవిష్యత్తుకు సరైన పునాదులు వేయలేకపోయాయని, సహజవనరులు ఉన్నా ఉపయోగించుకోలేని దుస్థితికి దేశాన్ని తీసుకొచ్చాయని విమర్శించారు. బీజేపీ (BJP) పాలన దేశాన్ని మధ్యరాతి యుగం వైపు తీసుకెళ్తుండగా ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ (Congress) విఫలమైందన్నారు. దేశంలో రోజురోజుకి పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో దేశాభివృద్ధికి ప్రత్యామ్నాయ అజెండా కావాలన్నారు. ప్రత్యామ్నాయ అజెండా తీసుకొచ్చే శక్తుల కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, కొత్త తరానికి కొత్త ఎజెండాతో కేసీఆర్ రాబోతున్నారని అన్నారు. ఎనిమిదేళ్ళలో తెలంగాణా రూపురేఖల్ని మార్చినట్లుగానే కొత్త తరానికి కొత్త అజెండాతో కేసీఆర్ రాబోతున్నారన్నారు. త్వరలోనే దేశ రూపురేఖల్ని మార్చే అజెండా కేసీఆర్ ప్రకటిస్తారని అన్నారు. కేసీఆర్ ఎజెండా నచ్చితే ప్రజలు ఆశీర్వదిస్తారని, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారని మంత్రి జగదీష్రెడ్డి వ్యాఖ్యానించారు.