హితకారిణి ఆస్తులు పరిరక్షించాలి
ABN , First Publish Date - 2022-08-08T06:11:52+05:30 IST
హితకారిణి సమాజం ఆస్తులను పరిరక్షించడంతో పాటు అన్ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు.
వీరేశలింగం వీలునామా ఆచరించాల్సిందే : జేఏసీ
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 7: హితకారిణి సమాజం ఆస్తులను పరిరక్షించడంతో పాటు అన్ఎయిడెడ్ ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అఖిలపక్షం నేతలు డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ఎన్జీవో హోమ్లో వీటీ హైస్కూల్ పూర్వ విద్యార్థుల సంఘం అభివృద్ధి కమిటీ కార్యదర్శి సానబోయిన రామారావు సమావేశం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పా రావు మాట్లాడుతూ హితకారిణి సమాజం ఆస్తులు వీరేశలింగం పంతులు రాసిన వీలునామా ప్రకారం ఉపయోగించాల్సి ఉండగా ప్రభుత్వం వాటిని సొం తం చేసుకునేందుకు పథకం వేస్తుందని ఆరోపించారు.జనసేన జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్ మాట్లాడుతూ వీటీ కళాశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పట్ల డిప్యూటీ కమిషనర్ విజయరాజు వ్యవహరిస్తున్న తీరు అఽభ్యంతరకరమన్నారు. ఉద్యోగ భద్రత కల్పించకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యుడు ముప్పాళ సుబ్బారావు మాట్లాడుతూ హితకారిణి సమాజం ఆస్తుల పరిరక్షణకు పాటుపడాలన్నారు. కందూకూరి ఆశయ సాధనకు అన్ని సంఘాలతో జేఏసీ నియమించాలని తీర్మానం చేశారు.ఈ కార్యక్రమంలో వీటీ కళాశాల పూర్వవిద్యార్థుల సంఘం ఉపాధ్యక్షుడు జామి సత్యనారాయణ, సీపీఎం, బీఎస్పీ, బీజేపీ, ఆప్ నాయకులు బి.పవన్, ఇసుకపట్ల రాంబాబు, కురగంటి సతీష్, రొంగల గోపి శ్రీనివాస్, అత్తిలి రాజు తదితరులు పాల్గొన్నారు.