Co-education Dangerous: పాఠశాలల్లో బాలబాలికలు కలిసి ఉండటం ప్రమాదకరం : కేరళ నేత
ABN , First Publish Date - 2022-08-19T23:21:48+05:30 IST
కేరళ (Kerala)లోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) జనరల్ సెక్రటరీ
తిరువనంతపురం : కేరళ (Kerala)లోని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జి పీఎంఏ సలామ్ (PMA Salam) అత్యంత వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాఠశాల తరగతి గదుల్లో బాలబాలికలు కలిసి కూర్చొనేందుకు అవకాశం కల్పించడం అత్యంత ప్రమాదకరమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ, పురుష భేదాలు లేని విద్యా వ్యవస్థను తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో సలామ్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కేరళ ప్రభుత్వ జెండర్ న్యూట్రల్ పాలసీలపై సలామ్ విరుచుకుపడ్డారు. ఇది చాలా ప్రమాదకరమని చెప్పారు. తరగతి గదుల్లో విద్యార్థినీ, విద్యార్థులు కలిసి కూర్చోవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. వారిని ఎందుకు అలా నిర్బంధిస్తున్నారు? అలాంటి అవకాశం ఎందుకు కల్పిస్తున్నారు? అని నిలదీశారు. ఇది కేవలం సమస్యలను మాత్రమే సృష్టిస్తుందన్నారు. విద్యార్థినీ, విద్యార్థులు చదువు నుంచి పక్కదారి పడతారని చెప్పారు.
స్త్రీ, పురుష సమానత్వమనేది మతపరమైన విషయం కాదన్నారు. ఇది నైతికతకు సంబంధించిన అంశమని చెప్పారు. విద్యార్థినీ, విద్యార్థులు జెండర్ న్యూట్రల్ యూనిఫారాలు ధరించాలని నిర్బంధించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. దీనిని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో జెండర్ న్యూట్రల్ ఐడియాలను రుద్దడం మానుకోవాలని ముస్లిం సంస్థలు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. విద్యా సంస్థల్లో ఉదారవాద సిద్ధాంతాలను అమలు చేయాలని వామపక్ష ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించాయి.