బ్యాడ్‌ బ్యాంక్‌ అవసరం.. అనివార్యం!

ABN , First Publish Date - 2020-08-27T06:47:43+05:30 IST

ప్రస్తుత పరిస్థితుల్లో మొండి బకాయిల(ఎన్‌పీఏ) పరిష్కారానికి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు కేవలం అవసరమే కాదు, అనివార్యమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు...

బ్యాడ్‌ బ్యాంక్‌ అవసరం.. అనివార్యం!

  • ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు 

న్యూఢిల్లీ: ప్రస్తుత పరిస్థితుల్లో మొండి బకాయిల(ఎన్‌పీఏ) పరిష్కారానికి బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు కేవలం అవసరమే కాదు, అనివార్యమని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. కరోనా సంక్షోభంతో బ్యాంకింగ్‌ రంగంలో ఎన్‌పీఏలు గణనీయంగా పెరగవచ్చని ఆర్‌బీఐతోపాటు పలువురు ఆర్థికవేత్తలు, రేటింగ్‌ ఏజెన్సీలు హెచ్చరించాయి. ఎన్‌పీఏల సమస్య నుంచి గట్టెక్కేందుకు పబ్లిక్‌ సెక్టార్‌ అసెట్‌ రిహాబిలిటేషన్‌ ఏజెన్సీ (పీఏఆర్‌ఏ) పేరుతో బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేయాలని 2017 ఆర్థిక సర్వే సైతం సూచించింది. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దువ్వూరి ఇంకా ఏమన్నారంటే.. 


  1. బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుతో మొండిబకాయిల పరిష్కారంలో పరస్పర ప్రయోజన వివాదాలు, అవినీతిని నివారించవచ్చు. 
  2. ఇప్పటికే విజయవంతమైన కొన్ని బ్యాడ్‌ బ్యాంక్‌ల విధివిధానాలు అందుబాటులో ఉన్నాయి. ధనహర్తా ఆఫ్‌ మలేషియా ఇందుకు మంచి ఉదాహరణ. మన దేశంలో బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటు కోసం దీని విధివిధానాలను ఆదర్శంగా తీసుకోవచ్చు.  
  3. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ వృద్ధి రేటు కనీసం -5 శాతానికి క్షీణించవచ్చు. వృద్ధి క్షీణతతో బ్యాంకుల ఎన్‌పీఏలూ పెరగవచ్చు. 2020 మార్చిలో 8.5 శాతంగా ఉన్న ఎన్‌పీఏల వాటా 2021 మార్చినాటికి 12.5 శాతానికి ఎగబాకవచ్చని ఈ మధ్య విడుదల చేసిన ఆర్థిక స్థిరత్వ నివేదికలో ఆర్‌బీఐ అంచనా వేసింది. 
  4. దివాలా పరిష్కార వ్యవస్థపై భారం ఇప్పటికే అధికమైంది. ఈ చట్టం అదనపు ఎన్‌పీఏల భారాన్ని మోయలేదు. దివాలా చట్టంతో ఎన్‌పీఏల పరిష్కారం గాడిన పడుతుందని, బ్యాంకుల ఆస్తుల ప్రక్షాళణకు దోహదపడుతుందని తొలుత నేనూ భావించా. కాలక్రమంగా విశ్వాసం సడలింది. 
  5. బ్యాడ్‌ బ్యాంక్‌ ఏర్పాటుకు సంబంధించి గతంలో నాకూ కొన్ని అభ్యంతరాలుండేవి. ఈమధ్యకాలంలో ఎదురైన అనుభవాల నేపథ్యంలో బ్యాంక్‌ ఏర్పాటుపై నా దృక్పథం మారింది. 

Updated Date - 2020-08-27T06:47:43+05:30 IST