మైనస్ 30 డిగ్రీల్లో 55 ఏళ్ల కమాండెంట్ పుషప్‌లు.. దేశానికే గర్వకారణమంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-02-23T16:32:48+05:30 IST

దేశసేవలో నిమగ్నమైన భారత సైన్యం..

మైనస్ 30 డిగ్రీల్లో 55 ఏళ్ల కమాండెంట్ పుషప్‌లు..  దేశానికే గర్వకారణమంటున్న నెటిజన్లు

దేశసేవలో నిమగ్నమైన భారత సైన్యం చూపే తెగువను వీక్షించినప్పుడు ప్రతి భారతీయుని ఛాతీ గర్వంతో ఉప్పొంగుతుంది. సరిహద్దుల్లో ఎంతటి క్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. దేశప్రజల శాంతి కోసం ఈ సైనికులు సరిహద్దుల్లో ఎప్పుడూ కాపలాగా ఉంటారు. తాజాగా ఐటీబీపీ జవాన్‌కు చెందిన ఒక వీడియో వైరల్‌‌గా మారింది. 55 ఏళ్ల కమాండెంట్ రతన్ లాల్ సింగ్ సోనాల్ లడఖ్‌లో 17,500 ఎత్తులో మైనస్ 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో 65 పుషప్‌లు చేసి.. అందరినీ ఆశ్చర్యపరిచారు. 


ఈ ప్రదేశం సముద్ర మట్టానికి దాదాపు 17 వేల 500 అడుగుల ఎత్తులో ఉంది. అక్కడ ఉష్ణోగ్రత మైనస్ 30 డిగ్రీలు. ఇలాంటి పరిస్థితుల్లో కమాండెంట్ ధైర్యం, ఉత్సాహాన్ని చూసిన వారంతా అతనిని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఆయన స్ఫూర్తికి వందనం చేస్తున్నారు. కాగా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ సిబ్బంది ఫోటోలు రావడం ఇదే మొదటిసారేమీ కాదు. అంతకుముందు, సైనికులకు శిక్షణ ఇస్తున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దానిలో ఐటీబీపీ సిబ్బంది మంచు ప్రాంతం మధ్యలో మైనస్ 25 డిగ్రీల ఉష్ణోగ్రతలో నిలబడి సాధన చేస్తూ కనిపించారు. కాగా దేశంలోని 5 కేంద్ర సాయుధ పోలీసు బలగాలలో ఐటీబీపీ ఒకటి. ఐటీబీపీ భారతదేశం-చైనా యుద్ధం సమయంలో 1962 అక్టోబర్‌లో ఏర్పడింది. 

Updated Date - 2022-02-23T16:32:48+05:30 IST