ఈ పట్టణంలో జీవించేది ఇద్దరే.. కానీ ఫేస్‌మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి

ABN , First Publish Date - 2020-10-19T05:16:14+05:30 IST

ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. గత ఎనిమిది నెలల్లో కరోనా దెబ్బకు

ఈ పట్టణంలో జీవించేది ఇద్దరే.. కానీ ఫేస్‌మాస్క్, భౌతిక దూరం తప్పనిసరి

రోమ్: ప్రపంచాన్ని కరోనా మహమ్మారి ఏ విధంగా వణికిస్తోందో కొత్తగా చెప్పనవసరం లేదు. గత ఎనిమిది నెలల్లో కరోనా దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా పదకొండు లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఈ స్థాయిలో విజృంభిస్తున్నప్పటికి అనేక దేశాల్లో సగానికి సగం మంది ఫేస్‌మాస్క్ ధరించడం లేదు. అంతేకాకుండా కనీసం భౌతిక దూరాన్ని కూడా పాటించడం లేదు. కానీ ఇటలీలోని ఓ మారుమూల గ్రామంలో ఇద్దరు వృద్దులు మాత్రం ఈ నిబంధనలను పాటిస్తున్నారు. ఇక్కడ విశేషమేంటంటే.. ఈ పట్టణంలో జీవించేది కేవలం వీరిద్దరు మాత్రమే. 


గియోవానీ కరీలి(82), గియాపీరో నోబిలి(74) అనే ఇద్దరు వృద్దులు ఇటలీలోని నార్టోసీ అనే మారుమూల గ్రామంలో జీవిస్తున్నారు. వీరిద్దరూ కూడా వేరు వేరు ఇళ్లలో జీవిస్తున్నప్పటికి వీరిద్దరూ ఫేస్‌మాస్క్‌ను ధరించి, భౌతిక దూరాన్ని పాటిస్తున్నారు. తాను అనారోగ్యానికి గురైతే చూసుకునే వారు లేరని.. తనని తానే చూసుకోవాలని గియోవానీ చెబుతున్నాడు. ఈ కారణం చేత తాను కరోనా నుంచి జాగ్రత్త పడుతున్నానని తెలిపాడు. ఇక తాను ప్రభుత్వం విధించిన ఆంక్షలను పాటిస్తున్నానని గియాపీరో చెప్పుకొచ్చాడు. తమకు ప్రశాంతంగా జీవించడం ఇష్టమని.. అందుకే ఈ మారుమూల గ్రామంలో జీవిస్తున్నట్టు ఇద్దరూ చెబుతున్నారు. కాగా.. కరోనా వ్యాప్తి చెందుతుండటంతో ఇటలీ ప్రభుత్వం ఫేస్ మాస్క్ ధరించడాన్ని, భౌతిక దూరం పాటించడాన్ని తప్పనిసరి చేసింది. ఇటలీలో ఇప్పటివరకు మొత్తం 4, 14,241 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 36,543 మంది మృత్యువాతపడ్డారు. 

Updated Date - 2020-10-19T05:16:14+05:30 IST