పన్ను చెల్లింపుదారులకు ఊరట
ABN , First Publish Date - 2020-10-25T09:50:13+05:30 IST
వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సమర్పించాల్సిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల గడువును ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పొడిగించింది...
- 2019-20 ఐటీ రిటర్నుల గడువు
- డిసెంబరు 31 వరకు పొడిగింపు
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ప్రభుత్వం మరింత ఊరట కల్పించింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సమర్పించాల్సిన ఆదాయ పన్ను (ఐటీ) రిటర్నుల గడువును ఈ ఏడాది డిసెంబరు 31 వరకు పొడిగించింది. ఆడిట్ చేసిన పద్దులు సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించింది. ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) శనివారం నాడు ఇందుకు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఆదాయ పన్ను చట్టం ప్రకారం.. ప్రతి ఏటా ఐటీ రిటర్నులను జూలై 31లోగా సమర్పించాల్సి ఉంటుంది. ఆడిట్ చేసిన పద్దులు సమర్పించాల్సిన వారు అక్టోబరు 31 నాటికి రిటర్నులు ఫైల్ చేయాలి. కరోనా సంక్షోభం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల గడువును తొలుత జూలై 31 నుంచి నవంబరు 30 వరకు పొడిగించింది. తాజాగా మరో నెల రోజుల అదనపు సమయం కల్పించింది. కరోనా సంక్షోభం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పన్ను చెల్లింపుదారులకు రిటర్నుల ఫైలింగ్కు మరింత సమయమిచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీబీడీటీ పేర్కొంది.
అంతర్జాతీయ/నిర్దిష్ట దేశీయ లావాదేవీల రిపోర్టు సమర్పించాల్సిన పన్ను చెల్లింపుదారులకు ఐటీ రిటర్నుల ఫైలింగ్ గడువును వచ్చే ఏడాది జనవరి 31 వరకు పొడిగించారు. ఇక ట్యాక్స్ ఆడిట్ రిపోర్టు, అంతర్జాతీయ/నిర్దిష్ట దేశీయ లావాదేవీల రిపోర్టు సమర్పణకు ఈ డిసెంబరు 31 వరకు సమయం కల్పించింది.
స్వీయ మదింపు పన్ను (సెల్ఫ్ అసె్సమెంట్ ట్యాక్స్) చెల్లింపుల విషయంలో చిన్న, మధ్య స్థాయి పన్ను చెల్లింపుదారులకూ ఊరట లభించింది. సీబీడీటీ ఈ చెల్లింపుల గడువు తేదీలనూ పొడిగించింది.