టీడీపీని గెలిపించే బాధ్యత ప్రజలదే..

ABN , First Publish Date - 2021-03-07T06:51:26+05:30 IST

జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత నగరవాసులపైనే ఉందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు అన్నారు.

టీడీపీని గెలిపించే బాధ్యత ప్రజలదే..
ఆరిలోవ రోడ్‌ షోలో విజయసంకేతం చూపిస్తున్న చంద్రబాబు, తదితరులు

జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు

కొమాది/ఆరిలోవ, మార్చి 6: జీవీఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించే బాధ్యత నగరవాసులపైనే ఉందని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయడు అన్నారు. జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి పెదగదిలి, పీఎంపాలెంలో ఆయన రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ జగన్‌ పాలన అంతా అన్నింటిపై బాదుడు, కూల్చివేతలతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు. అమ్మఒడి నాన్న బుడ్డీలకు చాలడం లేదని విమర్శించారు. ఆటోడ్రైవర్లకు రూ.15 వేలిచ్చి రూ.50 వేల వరకు పలు ట్యాక్సీలతో వారి పొట్ట కొడుతున్నారన్నారు. నిత్యావసర ధరల పెరుగుదలతో జనం బెంబేలెత్తిపోతున్నారన్నారు. విశాఖ అంతా స్వామిజీ  మహిమతో నిండిపోయిందని.. ఆయనను దర్శించుకుంటే అధికారులకు బదిలీలు ఉండవని, పెత్తనమంతా స్వామీజీ చేతిలో పెట్టిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని విమర్శించారు. తమ హయాంలో స్వచ్ఛ ర్యాంకింగ్‌లో విశాఖ మూడో స్థానంలో ఉండగా.. ఇప్పుడు 86వ స్థానానికి చేరిందని, ఇదంతా వైసీపీ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ఈ సందర్భంగా ఓ కార్యకర్త ఇచ్చిన సైకిల్‌ను ప్రదర్శించి అందరూ ఈ గుర్తుకే ఓట్లు వేసి టీడీపీ అభ్యర్థులను గెలిపించాలని చంద్రబాబు కోరారు. స్టీల్‌ప్లాంట్‌ను విదేశీయులకు అమ్మిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చంద్రబాబు కోరారు. వార్డు అభ్యర్థులతో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయడు, నాయకులు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-07T06:51:26+05:30 IST