వెదజల్లితేనే మేలు

ABN , First Publish Date - 2022-05-27T05:17:50+05:30 IST

వానకాలం సీజన్‌లో నారాయణపేట జిల్లా వ్యాప్తంగా నూతన సాగువిధానంపై దృష్టి మళ్లించేందుకు జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.

వెదజల్లితేనే మేలు
మడిలో నారు తీస్తున్న కూలీలు (ఫైల్‌)

- నూతన సాగు విధానానికి సిద్ధమవుతున్న జిల్లా రైతులు

- వరి వెదజల్లే పద్ధతితో తగ్గనున్న కూలీల ఖర్చులు

- పచ్చిరొట్ట ఎరువులతో  సారవంతమవుతున్న నేలలు

- ప్రతీ క్లస్టర్‌ పరిధిలో 50 ఏకరాల్లో నూతన సాగుకు సిద్ధం

- అవగాహన కల్పిస్తున్న అధికారులు 

నారాయణపేట, మే 26:  వానకాలం సీజన్‌లో నారాయణపేట జిల్లా వ్యాప్తంగా నూతన సాగువిధానంపై దృష్టి మళ్లించేందుకు జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌ సుధాకర్‌ ఆధ్వర్యంలో  రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. నూతన విధానం అమలు చేస్తే  తక్కువ ఖర్చుతో అధిక లాభాలు పొందవచ్చునని సూచిస్తున్నారు. జిల్లాలోని ప్రతీ క్లస్టర్‌ పరిధిలో ప్రతీ పంట 50 ఎకరాలకు తగ్గకుండా కొత్త పద్దతులతో చేయించాలనే లక్ష్యంతో రైతులను ప్రోత్సహిస్తున్నారు. పలు రైతు వేదికల్లో ఏఈవోలు పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి కోసం రైతుల నుంచి ఈకేవైసీ ఆధార్‌ లింక్‌ను ఏఈవోలు చేస్తున్నారు. 

నారాయణపేట జిల్లా వ్యాప్తంగా నేలను సారవంతం చేసేందుకు పచ్చిరొట్టె ఎరువులను ప్రోత్సహించాలని సంకల్పించారు. అధిక మోతాదులో వాడుతున్న రసాయన ఎరువుల వల్ల నేల సారం దెబ్బతిని పంటల దిగుబడిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల విధిగా పచ్చి రొట్టె ఎరువుల పెంపకం కో సం జిల్లాకు 1532 క్వింటాళ్ల జీలుగ విత్తనాలు సరఫరా చేసేందుకు సిద్ధమ య్యారు.  గతేడాది జిల్లా వ్యాప్తంగా 2వేల ఎకరాల్లో వెదజల్లే పద్ధ్దతితో రైతులు వరి పంటను సాగు చేశారు. వేదజల్లే పద్ధతివల్ల రైతులు పంటను సాగు చేస్తే ఎకరాకు ఐదువేల వరకు నాటు కూలీల ఖర్చు తగ్గుతుందని సూచిస్తున్నారు. 

 వానాకాలంలో 4,66,050 ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు చేసేందుకు రైతులు సిద్ధమౌతున్నారు. జిల్లాకు 51.912 వేల క్వింటాళ్ల విత్తనాలతో పాటు 66,357 వేల మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. వరి 1,47,651 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉంది. దీంతో 44,295 క్వింటాళ్ల వరి విత్తనాలు, కంది 1,22,617 ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉండడంతో 4,904 క్వింటాళ్ల కంది విత్తనాలు అవసరమవుతాయి. పత్తి 1,82,317 లక్ష ఎకరాల్లో సాగయ్యే అవకాశ ముండడంతో 1823 క్వింటాళ్ల పత్తి విత్తనాలు అవసర మవుతాయి. జొన్న 5780 ఎకరాల్లో సాగయ్యే అవకాశ ముండడంతో 231 క్వింటాళ్ల జొన్న విత్తనాలు అవసరమవుతాయి. ఇతర పంటలు 2625 ఎకరాల్లో సాగయ్యే అవకాశ ముంది. కాగా జిల్లాకు 66,054 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. 




Updated Date - 2022-05-27T05:17:50+05:30 IST