ఇది దోపిడీ ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-07-29T06:30:54+05:30 IST
ప్రజలపై యూజర్ చార్జీల పేరుతో పన్నుల బాదుడుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇది దోపిడీ ప్రభుత్వమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు
పన్నుల పెంపుపై మాజీ మంత్రి కాలవ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
రాయదుర్గంటౌన్, జూలై 28 : ప్రజలపై యూజర్ చార్జీల పేరుతో పన్నుల బాదుడుకు ప్రభుత్వం సిద్ధమైందని, ఇది దోపిడీ ప్రభుత్వమని మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు విమర్శించారు. మున్సిపాల్టీల్లో పన్నుల పెంపు, సంక్షేమంలో భారీగా కోతలను నిరసిస్తూ బుధవారం టీడీపీ నాయకులు, కార్యకర్తలతో స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో ధర్నా నిర్వహించి.. కమిషనర్ జబ్బార్ మియాకు వినతి పత్రం అందించారు. అనంతరం కాలవ మాట్లాడుతూ.. చెత్తపై కూడా పన్ను విధించవచ్చనే చెత్త ఆలోచన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికు రావడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఆస్తి విలువ ఆధారంగా పన్నులు పెంచడం హేయమైన చర్య అన్నారు. యూజర్ చార్జీల పేరిట చెత్తపై పన్ను విధించడంతో రాష్ట్ర ప్రజలపై రూ. ఎనిమిది వేల కోట్ల భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాల్లో అర్హులైన లబ్దిదారులకు అరకొరగా సాయం అందిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్న అమ్మఒడి, చేయూత, ఆసరా, చేదోడు, నేతన్న నేస్తం వంటి పథకాల ద్వారా అర్హుల్లో 15 శాతం మందికి కూడా ప్రభుత్వం నుంచి లబ్ది అందడం లేదని మండిపడ్డారు. రాయదుర్గం పట్టణంలో 6700 మందికి పైగా గార్మెంట్స్ కార్మికులు అర్ధాకలితో అలమటిస్తుంటే కేవలం 39 మందికి మాత్రమే రూ. పది వేలు సహాయం అందించారని మండిపడ్డారు. సంక్షేమం పేరుతో వందల కోట్ల రూపాయలు ప్రచార ఆర్భాటాలకు వెచ్చిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదల పేర్లు చెప్పి సెంటు స్థలంలో కూడా కోట్లాది రూపాయలు పాలకులు దండుకున్నారని విమర్శించారు. సంక్షేమం పేరుతో ప్రజాధనాన్ని దోచుకోవడంలో వైసీపీ నాయకులు పోటీపడుతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొద్దు నిద్రలేచి పెంచిన ఆస్తి, చెత్తపై విధించిన పన్నులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్లు నల్లపూల వెంకటేశులు, కడ్డిపూడి మహబూబ్ బాషా, పట్టణ అధ్యక్షులు పసుపులేటి నాగరాజు, కౌన్సిలర్ ప్రశాంతి, బళ్లారి జ్యోతి, మండల కన్వీనర్లు హనుమంతరెడ్డి, బలరామిరెడ్డి, లాలెప్ప, మాజీ ఎంపీపీ రాఘవ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పొరాళ్లు పురుషోత్తమ్, సంపత్ కుమారి, సుమలత, దబ్బడి నాగరాజు, తెలుగు యువత నాయకులు మురళి, అశోక్, షమీవుల్లా, శంకర్, తిప్పేస్వామి తదితరులు పాల్గొన్నారు.