విలేఖరులతో మాట్లాడుతున్న జనసేన నాయకులు
జనసేన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త వీరసూర్యచంద్ర
నర్సీపట్నం అర్బన్, జూన్ 24: పేద మైనారిటీల వివాహాలకు సంబంధించిన దుల్హన్ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు లేవనడం సిగ్గుచేటని జనసేన నర్సీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త రాజాన వీరసూర్యచంద్ర ఆరోపించారు. శుక్రవారం ఆయనిక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యిందన్నారు. దుల్హన్ పథకానికి రూ.50 వేలు కాదు.. లక్ష ఇస్తామని ముస్లింలకు హామీ ఇచ్చి.. ఇప్పడు మొండిచేయి చూపడం సరికాదన్నారు. అమలుకాని హామీలు ఇచ్చి ముస్లింలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మోసం చేశారని ఆరోపించారు. ఉన్నత చదువుల కోసం అందజేస్తున్న విద్యా పథకాన్ని అమలు చేయలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉండడం దారుణమన్నారు. ముస్లింలు రోడ్లపైకి వచ్చి జగన్మోహన్రెడ్డిని నిలదీయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు వూడి చక్రవర్తి, రేగబల్ల శివ, రాజాన లవకుమార్, తదితరులు పాల్గొన్నారు.