IPL 2022 Auction: ఇప్పటి వరకు ఇషాన్ కిషనే టాప్
ABN , First Publish Date - 2022-02-12T22:55:16+05:30 IST
ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు అమ్ముడైన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా
బెంగళూరు: ఐపీఎల్ వేలంలో ఇప్పటి వరకు అమ్ముడైన ఆటగాళ్లలో ఇషాన్ కిషన్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ముంబై ఇండియన్స్ అతడిని ఏకంగా రూ. 15.25 కోట్లకు కొనుగోలు చేసింది. అతడి కోసం సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా పోటీ పడింది. రూ. 14 కోట్ల వరకు వెచ్చించేందుకు ముందుకొచ్చింది. అయితే, చివరికి రూ. 15.25 కోట్లు కుమ్మరించి ముంబై ఇండియన్స్ సొంతం చేసుకుంది.
విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ను సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.10.75 కోట్లకు సొంతం చేసుకుంది. ఎలాంటి బ్యాటర్లను అయిన ముప్పుతిప్పలు పెట్టగల శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగను ఆర్సీబీ రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. అంతకుముందు అంతే ధరకు హర్షల్ పటేల్ను సొంతం చేసుకుంది. షిమ్రన్ హెట్మెయిర్, దేవదత్ పడిక్కల్ను రాజస్థాన్ రాయల్స్ కొనుగోలు చేసింది.
శ్రేయీస్ అయ్యర్ను కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రూ. 12.25 కోట్లకు కొనుగోలు చేయగా, శిఖర్ ధవన్, కగిసో రబడను పంజాబ్ కింగ్స్ యాజమాన్యం వరుసగా 8.25 కోట్లు, రూ. 9.25 కోట్లతో సొంతం చేసుకుంది. డేవిడ్ వార్నర్, మహ్మద్ షమీని ఢిల్లీ కేపిటల్స్, గుజరాజత్ టైటాన్స్ కొనుగోలు చేశాయి.