వైసీపీ పాలనలో మహిళలకు ఇదేనా గౌరవం
ABN , First Publish Date - 2022-08-14T06:27:36+05:30 IST
రాష్ట్రంలో అధికార వైసీపీ హయాంలో మహిళల గౌరవం మంట కలిసిపోయిందని మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు, తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు ధ్వజమెత్తారు.
గోరంట్లకు ఇచ్చిన గౌరవం మహిళలకు లేదా
తెలుగుదేశం పార్టీ నేతల ధ్వజం
చోడవరం, ఆగస్టు 13: రాష్ట్రంలో అధికార వైసీపీ హయాంలో మహిళల గౌరవం మంట కలిసిపోయిందని మాజీ ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బత్తుల తాతయ్యబాబు, తెలుగురైతు రాష్ట్ర ఉపాధ్యక్షుడు గూనూరు మల్లునాయుడు ధ్వజమెత్తారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. మహిళల పట్ల దిగజారుడుతనంగా వ్యవహరించిన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్కు ఇచ్చిన గౌరవం, రాష్ట్ర మహిళలకు ఇవ్వలేకపోయినందుకు సీఎం జగన్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఎంపీ మాధవ్ వ్యవహారంలో పోలీసు అధికారులతో తప్పుడు ప్రకటనలు చేయించి అతడిని వెనకేసుకుని వచ్చిన జగన్ సర్కారులో మహిళలకు ఇంతకంటే మర్యాదను ఆశించడం అత్యాశే అవుతుందన్నారు. మంత్రులు, ఎంపీల బాగోతాలు బయటపడుతున్నా, ప్రభుత్వం నిస్సిగ్గుగా వారిని వెనకేసుకు వస్తున్నదన్నారు. రాష్ట్రంలో కోట్లాది మహిళల వైపు ఉంటారా.. తమ ఎంపీ వైపు ఉంటారో జగన్ తేల్చుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఎంపీ మాధవ్తో పదవికి రాజీనామా చేయించి అతడిపై గట్టి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బొడ్డేడ గంగాధర్, దేవర రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.