వడ్డీ రాయితీ ఇవ్వరా?
ABN , First Publish Date - 2022-05-14T05:49:48+05:30 IST
మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వడ్డీలేని రుణాలు సత్ఫలితాలిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రాయితీని మాత్రం ఇవ్వడం లేదు.
మెదక్ జిల్లాలో రూ. 82.61 కోట్ల బకాయిలు
మొత్తం లక్షా 35 వేల మంది సభ్యులు
మూడేళ్లుగా స్వయం సహాయక సంఘాల ఎదురుచూపులు
మెదక్ మున్సిపాలిటీ, మే 13: మహిళా సంఘాల సభ్యుల ఆర్థికాభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వడ్డీలేని రుణాలు సత్ఫలితాలిస్తున్నప్పటికీ ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ రాయితీని మాత్రం ఇవ్వడం లేదు. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను మహిళా సంఘాల సభ్యులు సకాలంలో చెల్లిస్తే వారికి ఆరు నెలలకోసారి ప్రభుత్వం వడ్డీ రాయితీ చెల్లించాలి. ఏటా ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే రాయితీ ఇస్తామని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఇవ్వడం లేదు. కానీ మూడు సంవత్సరాలుగా చెల్లించకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు నిరాశచెందుతున్నారు.
మూడేళ్లుగా రూ.82.61 కోట్ల బకాయిలు
జిల్లాలో 13,500 స్వయం సహాయక సంఘాలు ఉండగా వాటిలో లక్షా 35 వేల మంది సభ్యులు ఉన్నారు. 2016-17 సంవత్సరంలో 11,727 సంఘాలకు గాను రూ.22.70 కోట్లు, 2017-18 సంవత్సరంలో 11,929 సంఘాలకు గాను రూ.24.66 కోట్లు, 2018-19లో 10,243 సంఘాలకు గాను రూ.7.29 కోట్ల వడ్డీ రాయితీని ప్రభుత్వం చెల్లించింది. 2019-20లో 11,352 సంఘాలకు గాను రూ.2.82 కోట్లు, 2020-21లో 11,506 సంఘాలకు రూ.2.98కోట్లు, 2021-22 సంవత్సరంలో 12,009 సంఘాలకు రూ.2.45 కోట్ల వడ్డీ రాయితీ కింద చెల్లించాల్సి ఉంది. మూడేళ్లైనా వడ్డీ రాయితీని జమ చేయకపోవడంతో మహిళా సంఘాల సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.