పట్టు చిక్కేనా?
ABN , First Publish Date - 2021-10-12T05:44:27+05:30 IST
వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల లక్ష్యం తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనేనా? అన్నతో వచ్చిన విభేదాలు దారికి తెచ్చుకునేందుకే ఈ రాజకీయ వేదికా? అన్న మిలియన్ డాలర్ల ప్రశ్న తెలంగాణ ప్రజలు, చోటా, బడా నేతల మదిని ఇంకా తొలుస్తూనే ఉంది.
నీలగిరిలో నేడు షర్మిల నిరుద్యోగ దీక్ష
నల్లగొండ నుంచి రాజకీయ వ్యూహాత్మకంగా అడుగులు
వేచి చూసే ధోరణిలో ఇతర పార్టీల నేతలు
ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఐదోసారి వైఎస్ఆర్టీపీ అధినేత్రి పర్యటన
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ) : వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల లక్ష్యం తెలంగాణలో రాజన్న రాజ్యం స్థాపనేనా? అన్నతో వచ్చిన విభేదాలు దారికి తెచ్చుకునేందుకే ఈ రాజకీయ వేదికా? అన్న మిలియన్ డాలర్ల ప్రశ్న తెలంగాణ ప్రజలు, చోటా, బడా నేతల మదిని ఇంకా తొలుస్తూనే ఉంది. ప్రధాన రాజకీయ పార్టీల్లో వివిధ హోదాల్లో ఉండి గౌరవ, మర్యాదలు దక్కక అసంతృప్తి తో రగిలిపోతున్న వారి సంఖ్య పెద్ద ఎత్తున ఉన్నా వైఎస్ఆర్టీపీ విషయంలో ఇంకొంత కాలం చూద్దాం అన్న ధోరణిలోనే ఉన్నారు.
మొదట్లోనే చేరిన వారికి కీలక పదవులు కట్టబెడితే రాబోయే రోజుల్లో బడా నేతలు చేరికకు ప్రతిబంధకంగా మారుతుంది. కిందిస్థాయిలో కమిటీల నిర్మాణం, పాద యాత్ర ఆ తర్వాతే కీలక నేతల చేరికలు అంటూ షర్మిల పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. జగనన్న వదిలిన బాణా న్ని అంటూ రెండుసార్లు, సొంతగా పార్టీ పెట్టిన తర్వాత మూడోసారి మొత్తంగా ఉమ్మడి జిల్లాకు ఐదోసారి షర్మిల వస్తున్నారు. మొదటిసారి నల్లగొండ జిల్లాకేంద్రానికి వస్తున్న నేపథ్యంలో ఆమె దీక్షపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైఎస్ బిడ్డను జిల్లా జనం ఏ మేరకు ఆదరిస్తారో అన్న చర్చ జిల్లాలో కొనసాగుతోంది.
నిరుద్యోగ సమస్యపై సమరం
ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి, నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ప్రతి మంగళ వారం రాష్ట్రంలోని ఏదో ఒక ప్రాంతం లో షర్మిల ఒక రోజు దీక్ష చేపడుతు న్నారు. గతంలో మునుగోడు నియోజకవర్గంలోని చండూరు లో చేపట్టగా తాజాగా రాజకీ యంగా, చారిత్రాత్మకంగా రాష్ట్రం లోనే గుర్తింపు పొందిన నల్లగొండ జిల్లాకేంద్రంలో మంగళవారం దీక్ష చేపడు తున్నారు. దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి పిట్టా రాంరెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జిలతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. సోదరుడు వైఎస్ జగన్ జైలులో ఉం డగా, ఆయన కోసం షర్మిల చేపట్టిన పాదయాత్ర జిల్లాలో విజయ వంత మైంది. నాటి పాదయాత్ర ఆమె మునుగోడు, నాగా ర్జునసాగర్, మిర్యాలగూడ మీదుగా సాగింది. ఆ మేరకు జిల్లా సమస్య లపై ఆనాడే ఆమె కొంత అవగాహన ఏర్పరుచుకున్నారు. అదే మాదిరిగా వైఎస్ మృతి అనంతరం జిల్లాలో జరిగిన పలు మరణాలకు సంబంధించి కూడా షర్మిల స్వయంగా జిల్లాలో రెండోసారి పరామర్శ యాత్ర రూపంలో పర్యటించారు. ఈ రెండు పర్యటనల్లో షర్మిలను జిల్లావాసులు దగ్గరి నుంచి చూశారు. వైఎస్ అభిమానులు, అనుచరులు ఆమె పర్యటనలకు ఏర్పాట్లు చేయడంతో స్థానిక నాయకత్వ తీరుపైనా ఆమెకు కొంత అవగాహన ఏర్పడింది. ఆనాడు తెరవెనుక భారీ యంత్రాంగం, మంత్రాంగం ఉండగా ఇప్పుడు అన్నీతానై పెట్టిన కొత్త పార్టీకి జిల్లాలో ఏమేరకు ఆదరణ ఉంటుందోనని వేచి చూస్తున్నారు. వైఎస్ఆర్టీపీకి బలమైన నాయకత్వం రావాలంటే అది కాంగ్రెస్ నుంచే కానీ జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు కాకలు తీరిన వారు కావడంతో ఇప్పటికిప్పుడు అంతపెద్ద పార్టీ, నేతలను వీడి షర్మిల వైపు వెళ్లే పరిస్థితి లేదు. షర్మిలతో తమకు ఇబ్బందే, తమ ఓట్లు చీలడం ఖాయ మని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఆమె పార్టీకి ఎంత దూరం ఉంటే అంత మంచిదని, ఎంత తక్కువ మాట్లా డితే అంత మేలన్న రీతిలో చూసీచూడనట్లు ఉంటు న్నారు. టీడీపీ, సీపీఎం, సీపీఐ ప్రభావం తగ్గుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో షర్మిల ఏ మేరకు దూసు కెళతారో? ఏ పార్టీకి గండి కొడతారో? అన్న చర్చ జిల్లాలో కొనసాగుతోంది. పార్టీ పెట్టాక చండూరులో ఆ తర్వాత ఏపూరి సోమన్న ఆధ్వర్యంలో తుంగతుర్తిలో సభలు ఏర్పా టు చేశారు. తుంగతుర్తి నియోజకర్గ సభకు మంచి స్పందన కనిపించింది. తుంగతుర్తి టికెట్ ఏపూరి సోమన్నకే అని ప్రకటించిన జిల్లాలో ఒక ఊపు తెచ్చే ప్రయత్నం చేశారు. తాజాగా నల్లగొండ దీక్షకు జనం స్పందన ఏ రీతిలో ఉంటుందో చూడాల్సి ఉంది.
వ్యూహాత్మకమేనా?
‘ముందుగా చేరే వారికి కీలక పదవులన్నీ అప్పగిస్తే అది పార్టీ మనుగడకే ప్రమాదం. మొదట చేరి కీలక పదవుల్లో ఉన్న వారిని చూసి ఇతర పార్టీల నుంచి రావాలనుకున్న దిగ్గజాలు వెనకడుగు వేస్తారు’ గ్రామస్థాయి నుంచి నియోజకవర్గం, జిల్లాస్థాయి వర కు కమిటీలు వేసుకోవాలనేది తమ అధినాయకురాలు వ్యూహం, పాదయాత్ర తర్వాతే ఇతర పార్టీల నుంచి పెద్ద నాయకుల చేరికలు తప్పకుండా ఉంటాయి, అని ఆ పార్టీకి చెందిన కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేసిన తూడి దేవేందర్ రెడ్డి మాత్రమే ఇతర పార్టీ నుంచి వచ్చి షర్మిల గూటిలో చేరిన వారి జాబితాలో ఉన్నారు. ఆయనకు రాష్ట్ర అధికార ప్రతినిధి, అంతర్గత వ్యవహారాల బాధ్యతలు అప్పగించారు. నియోజకవర్గా ల వారీగా చూస్తే పిట్ట రాంరెడ్డి (సూర్యాపేట), ఏపూరి సోమన్న(తుంగతుర్తి), ఇంజం నర్సిరెడ్డి(మిర్యాలగూడ), ఆదెర్ల శ్రీనివాసరెడ్డి(హుజూర్నగర్), ఇరుగు సునీల్ కుమార్(నకిరేకల్), పచ్చిపాల వేణు(కోదాడ), వడ్లోజు వెంకటేశ్ (ఆలేరు),మల్లు రవి(నాగార్జునసాగర్), గోవ ర్దన్, పర్వతం వేణు, ఫయాజ్(నల్లగొండ), కళ్యాణ్ నాయక్, సిరాజ్ఖాన్(దేవరకొండ), షరీఫ్ (మునుగో డు), అతార్, జీవన్(భువనగిరి) పనిచేస్తున్నారు.