భూకబ్జాదారుగా ప్రభుత్వమా?
ABN , First Publish Date - 2022-05-19T07:51:50+05:30 IST
‘‘రాష్ట్ర ప్రభుత్వం భూకబ్జాదారుగా ప్రవర్తించడం సరికాదు. ఇది సరైన పద్ధతి కాదు. 40-50 ఏళ్ల క్రితం విక్రయించిన భూములను ఇప్పుడు తమవి అంటున్నారు.
- అలా ప్రవర్తించడం సరికాదన్న సుప్రీం కోర్టు
- 40-50 ఏళ్ల క్రితం అమ్మిన భూములు తమవి అనడమేంటి?
- హుడా వేలం తర్వాత రెవెన్యూ అధికారులు బోర్డు పెడతారా!
- హైదర్నగర్లో గోల్డ్స్టోన్ కంపెనీ భూములపై సుప్రీం వ్యాఖ్య
న్యూఢిల్లీ, మే 18(ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర ప్రభుత్వం భూకబ్జాదారుగా ప్రవర్తించడం సరికాదు. ఇది సరైన పద్ధతి కాదు. 40-50 ఏళ్ల క్రితం విక్రయించిన భూములను ఇప్పుడు తమవి అంటున్నారు. హుడా వేలం వేసిన భూముల వద్దకు రెవెన్యూ అధికారులు వెళ్లి ఇది ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టిన కేసులు చూశాము.’’ అని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లిల ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైదర్నగర్లోని సర్వే నెంబరు 172లో దాదాపు 98 ఎకరాల భూమి తమదేనని గోల్డ్స్టోన్ కంపెనీ, ఆ కంపెనీ అధినేత గోల్డ్స్టోన్ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లో జోక్యాన్ని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ దాఖలు చేసింది. ఈ భూములు ఎవరికీ చెందవని, ఇవి ప్రభుత్వ భూములని రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్లో పేర్కొంది. బుధవారం దీనిపై విచారణ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇవి ప్రభుత్వ భూములని భావించడానికి ప్రభుత్వానికి ఎన్నేళ్లు పట్టిందని ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ వాదిస్తూ.. కోర్టు ముందు తాను అన్ని రికార్డులు ప్రవేశపెడతానన్నారు.
గోల్డ్స్టోన్ తరఫున సీనియర్ న్యాయవాదులు వికాస్ సింగ్, మినాక్షి అరోరా వాదిస్తూ.. ఈ భూములు ప్రభుత్వానికి చెందుతాయని గత ప్రభుత్వాలు పిటిషన్లు వేయగా.. ఇవి జాగీరు భూములు కావని గతంలో సుప్రీం కోర్టు పలు తీర్పులిచ్చిందని గుర్తు చేశారు. భూములు ప్రభుత్వానివి కావని కోర్టు తేల్చిన తర్వాత మళ్లీ రాష్ట్ర ప్రభుత్వం అప్లికేషన్ ఎందుకు వేసిందని అడిగారు. రాష్ట్ర ప్రభుత్వ జోక్యాన్ని తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, కేసులో రాష్ట్ర ప్రభుత్వ జోక్యంతో పాటు పలువురు ప్రైవేటు వ్యక్తుల జోక్యం కోరుతూ దాఖలైన అప్లికేషన్లను అనుమతించిన ధర్మాసనం వాటికి సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.