విద్యుత్తు కొరతతో వేసవిలో ఇబ్బందులు తప్పవా?

ABN , First Publish Date - 2022-04-13T21:37:45+05:30 IST

రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల్లో విద్యుత్తు కొరత ప్రజలను వేధించే

విద్యుత్తు కొరతతో వేసవిలో ఇబ్బందులు తప్పవా?

న్యూఢిల్లీ : రానున్న రోజుల్లో చాలా రాష్ట్రాల్లో విద్యుత్తు కొరత ప్రజలను వేధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవి కాలంలో విద్యుత్తు కోసం డిమాండ్ పెరుగుతుండగా, విద్యుత్తు ఉత్పత్తి కర్మాగారాలకు అవసరమైన బొగ్గు తగినంత అందుబాటులో లేదు. బొగ్గు దిగుమతి వ్యయాలు అధికంగా ఉండటంతోపాటు సరఫరా తక్కువగా ఉంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం కూడా దీనిపై కనిపిస్తోంది. 


రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల రష్యా బొగ్గుపై ఆంక్షలు అమలవుతున్నాయి. యూరోపు దేశాల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. బొగ్గు వాణిజ్యం ఒడుదొడుకుల్లో పడింది.  ఫలితంగా దిగుమతి చేసుకునే బొగ్గు ధరలు పెరిగాయి. ఏప్రిల్ 7నాటికి 80.08  మిలియన్ యూనిట్ల విద్యుత్తు కొరత ఉంది. 2021 అక్టోబరులో దేశంలోని 115 విద్యుత్తు ఉత్పత్తి కర్మాగారాల వద్ద బొగ్గు నిల్వలు అతి తక్కువ స్థాయిలో ఉండేవి. అప్పట్లో విద్యుత్తు సంక్షోభం ఏర్పడింది. ప్రస్తుతం ఆనాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 


మహారాష్ట్ర రాష్ట్ర విద్యుత్తు పంపిణీ కంపెనీ లిమిటెడ్ మార్చి 31న ఇచ్చిన నోటీసు ప్రకారం, రాష్ట్రంలోని వ్యవసాయ విద్యుత్తు వినియోగదారులకు విద్యుత్తు సరఫరాను తాత్కాలికంగా తగ్గించాలని నిర్ణయించారు. ఏప్రిల్ 10నాటికి విద్యుత్తు సరఫరా కొరత ఎక్కువగా కనిపించిన రాష్ట్రాల జాబితాలో, మధ్య ప్రదేశ్ (9.67 మిలియన్ యూనిట్లు), పంజాబ్ (4.5 మిలియన్ యూనిట్లు), హర్యానా (4.39 మిలియన్ యూనిట్లు), జార్ఖండ్ (2.29 మిలియన్ యూనిట్లు), కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్మూ-కశ్మీరు, లడఖ్‌ (4.65 మిలియన్ యూనిట్లు) ఉన్నాయి. 


వేసవి కాలంలో డిమాండ్‌కు తగినట్లుగా విద్యుత్తును సరఫరా చేయాలంటే, భారత దేశం బొగ్గు దిగుమతులను పెంచుకోవలసి ఉంటుందని ఏప్రిల్ 1న ఎస్ అండ్ పీ గ్లోబల్ తెలిపింది. 


Updated Date - 2022-04-13T21:37:45+05:30 IST